కర్ణాటకలోని శివమొగ్గలో భారీ పేలుడు సంభవించింది. గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ క్వారీలో జరిగిన పేలుడుతో 15 మంది చనిపోగా.. మరికొంత మంది గాయపడ్డారు. క్వారీకి జిలెటిన్ స్టిక్స్, డైనమైట్స్ తీసుకువచ్చిన లారీలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు కిలోమీటరన్నర దూరం వరకు ఎగిసిపడ్డాయి. పేలుడు ప్రభావంతో శివమొగ్గ, చిక్మగుళూరు, ఉత్తర కన్నడ జిల్లాలో తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. రాత్రి సమయంలో ఒకేసారి భారీ పేలుడు, ప్రకంపనలు రావడంతో.. భూకంపం వచ్చిందేమోనని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు తీవ్రతకు భూమిలో 15 నుంచి 20 మీటర్ల లోతుకు గుంతలు ఏర్పడ్డాయి. సుమారు 50 డైనమైట్లు ఒకదాని తరువాత ఒకటి పేలడంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రమాదం జరిగిన స్థలంలో రైల్వే పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పేలుడుకు గల కారణం ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అశోక్ నాయక్ స్పందించారు. ‘ఇంట్లో ఉన్న నేను కూడా ఈ భారీ శబ్దం విన్నాను. ప్రమాదస్థలంలో దట్టమైన పొగ అలముకుంది. ఇప్పటికైతే 15 మంది చనిపోయారు. కానీ, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది’ అని ఆయన అన్నారు.
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు శివమొగ్గ స్వస్థలం. ఆయన కూడా ఈ ప్రమాదంపై స్పందించి.. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అధికారులు తక్షణమే సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించారు. పేలుడుపై ఉన్నతస్థాయి ఎంక్వైరీ జరపాలని ఆయన ఆదేశించారు.
శివమొగ్గ ఘటన పట్ల ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. ‘ఈ ఘటనలో 15 మంది చనిపోవడం బాధాకరం. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది’ అని పీఎంవో ట్వీట్ చేసింది.
Pained by the loss of lives in Shivamogga. Condolences to the bereaved families. Praying that the injured recover soon. The State Government is providing all possible assistance to the affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2021
For More News..