చెత్తను తీసుకెళ్లే వ్యాన్ లో.. డెడ్ బాడీని తరలించిన్రు

చెత్తను తీసుకెళ్లే వ్యాన్ లో..  డెడ్ బాడీని తరలించిన్రు
  •  యూపీలో మున్సిపల్ వర్కర్లు, పోలీసుల నిర్వాకం
  •  8 మందిపై సస్పెన్షన్ వేటు

లక్నో: అతను ఏదో పని మీద గవర్నమెంట్ ఆఫీస్ కు వచ్చాడు. ఏమైందో ఏమో గానీ.. ఆఫీసు ముందే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే ప్రాణాలు వదిలాడు. ఇంతలో పోలీసులు, మున్సిపల్ వర్కర్లు వచ్చారు. అంబులెన్స్ కూడా అక్కడే ఉంది. అయినా.. ఆ డెడ్ బాడీని చెత్తను పడేసినట్లుగా.. మున్సిపల్ గార్బేజ్ వ్యాన్ లో వేసుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. కరోనా భయంతో డెడ్ బాడీని మానవత్వం మరిచిపోయి చెత్త వ్యాన్ లో తరలించిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్​ లోని బలరామ్ పూర్ లో జరిగింది. డెడ్ బాడీని చెత్త వ్యాన్ లో వేసుకుని పోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నలుగురు వర్కర్లు, నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.

లక్నోకు 160 కి.మి. దూరంలోని బలరామ్ పూర్ కు చెందిన మహ్మద్ అన్వర్ అనే ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడో ఇంకా తెలియరాలేదు. అతడికి కరోనా వైరస్ సోకిందో, లేదో కూడా తెలియదు. అయినా, కరోనా భయంతో అంబులెన్స్ సిబ్బంది అతడి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు ముందుండి మరీ చెత్త వ్యాన్ లో డెడ్ బాడీని తరలించడం వీడియోల్లో కనిపించింది. ఈ సంఘటనపై గురువారం బలరామ్ పూర్ జిల్లా ఎస్పీ దేవ్ రంజన్ వర్మ మీడియాతో మాట్లాడారు. మహ్మద్ అన్వర్ డెడ్ బాడీని అలా నిర్లక్ష్యంగా తరలించడం దారుణమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒకవేళ అతడు కరోనాతో చనిపోయినా, పీపీఈ కిట్ వేసి, గౌరవంగా డెడ్ బాడీని తరలించి ఉండాల్సిందన్నారు. దీనిపై డిపార్ట్ మెంట్​​పరమైన ఎంక్వైరీకి కూడా ఆదేశించామన్నారు.

Mohammed Anwar