సినిమాను మించిన ట్విస్ట్ : బీహార్ లో చనిపోయాడు.. ఢిల్లీలో తింటూ కనిపించాడు

సినిమాను మించిన ట్విస్ట్ : బీహార్ లో చనిపోయాడు.. ఢిల్లీలో తింటూ కనిపించాడు

ఎప్పుడో మిస్సవడం ..కొంత కాలం  తరువాత దొరకడం వంటివి మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. నిజ జీవితంలో అలాంటివి జరగడం చాలా అరుదు. కానీ అలాంటి సంఘటనే జరిగింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన  నిశాంత్ కుమార్  అనే వ్యక్తి  నాలుగు నెలల క్రితం తప్పిపోయి ఇప్పుడు నోయిడాలోని మోమోస్ స్టాల్‌లో  తింటూ కనిపించాడు.  అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే  అతని బావమరిది కిడ్నాప్ చేశాడని నిశాంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాని తప్పిపోయిన వ్యక్తి ఆచూకి మాత్రం అతని బావమరిది రవిశంకర్ సింగ్ గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే...

ఈ  ఏడాది జనవరిలో బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన వ్యక్తి తప్పిపోవడంతో   చనిపోయాడని కుటుంబీకులు భావించారు. అతను జనవరి 31న తన అత్తమామల ఇంటికి పెళ్లికి వెళ్తుండగా అదృశ్యమయ్యాడు. దీంతో అతని బావమరిది రవిశంకర్ సింగ్ సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. నిశాంత్ కుమార్ కుటుంబం సభ్యులు మాత్రం బావమరిదే అతడిని కిడ్నాప్ చేశాడని ఆరోపించారు. 

నాలుగు నెలల తర్వాత...

నోయిడాలోని సెక్టార్ 50లో ఒక మోమోస్ స్టాల్ దగ్గర.. బిచ్చగాడిలా ఉండి.. ఆహారం కోసం అర్థిస్తున్న వ్యక్తిని రవిశంకర్ సింగ్  గమనించాడు. అతడిని బిచ్చగాడు అనుకుని ఆ దుకాణ యజమాని తరుముతున్నాడు. అతడిని రవిశంకర్ సింగ్ వారించి.. అతనికి ఆహారం ఇవ్వాలని బిల్లు తాను చెల్లిస్తానని చెప్పి.. ఇప్పించాడు.   ఆహారం తీసుకున్న తరువాత రవిశంకర్ సింగ్ 'బిచ్చగాడు' గుర్తింపును అడిగాడు. చిరునామా గురించి అడిగాడు. అప్పుడతను తాను బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని నౌగాచియాకు చెందిన వ్యక్తి అని గడ్డం, మీసాలతో ఉన్న వ్యక్తి చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి తన పేరు నిశాంత్ కుమార్ అని, మాజీ బ్యాంక్ ఉద్యోగి సచ్చిదానంద సింగ్ కొడుకు అని కూడా చెప్పాడు.

అనేక రకాలుగా ఇబ్బంది పడ్డా...

దీంతో  రవిశంకర్ సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  వారు వచ్చి అతను చెప్పింది అంతా విన్నారు. బీహార్‌లోని అతని స్నేహితులు, కుటుంబీకులను సంప్రదించారు. ఆ తరువాత ఆ వ్యక్తి తప్పిపోయి నెలలు గడుస్తున్నాయని తెలుసుకున్నారు. తరువాత రవిశంకర్ సింగ్ ఆ వ్యక్తి ఫోటోను కూడా కుటుంబ సభ్యులకు పంపారు. తనపై వచ్చిన ఆరోపణల వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని అన్నారు. కొన్ని నెలల క్రితం అతను కనిపించకుండా పోవడంతో.. అతను చనిపోయాడని అతని మామయ్య పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో తాను అనేక రకాల చిత్రహింసలు ఎదుర్కున్నానని చెప్పాడు. 

నిశాంత్ మానసిక స్థితి సరిగా లేదు

ప్రస్తుతం నిశాంత్ కుమార్ మానసికంగా, శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడని  పోలీసు అధికారులు పేర్కొన్నారు. స్థానికులతో మాట్లాడగా..  15 రోజులుగా వ్యక్తి ఇలా తిరగడం చూశామని పోలీసులకు చెప్పారు. నిశాంత్ కుమార్ బీహార్ నుండి నోయిడాకు ఎలా చేరుకున్నాడో తెలుసుకోవడానికి పోలీసులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా భాగల్‌పూర్‌కు తీసుకెళ్లారు.