కోర్టులో బాంబులు విసిరిన లాయర్!

కోర్టులో బాంబులు విసిరిన లాయర్!

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో ఓ లాయర్ క్రూడ్ బాంబులతో తోటి లాయర్లపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక లాయర్‌కి తీవ్ర గాయాలవగా, మరో ఇద్దరు స్వల్పగాయాలపాలయ్యారు. రెండు లాయర్ల గ్రూపుల మధ్య వివాదం కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

గురువారం మధ్యాహ్నం లక్నో కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఓ కోర్టులోని బాస్ అసోసియేషన్ సెక్రెటరీ సంజీవ్ లోధీ ఆఫీసులో మరో లాయర్ క్రూడ్ బాంబులు విసిరేశాడు. మూడు నాలుగు బాంబులు విసరగా.. వాటిలో ఒకటి పేలింది. దీంతో అక్కడ ఉన్న సంజీవ్ లోధీ, మరో లాయర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. అయితే లోధీని కలిసేందుకు వచ్చిన ఓ లాయర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. పేలకుండా ఉన్న మూడు బాంబులను గుర్తించారు. వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

తనపై కావాలనే జితూ యాదవ్ అనే లాయర్ దాడికి పాల్పడ్డాడని సంజీవ్ చెబుతున్నారు. ఇంతటి సెక్యూరిటీ ఉంటే కోర్టులో ఈ దాడి జరగడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. యూపీ అసెంబ్లీకి కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్న ఈ కోర్టులోకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయని, అధికారుల వైఫల్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు తక్షణం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.