ఢిల్లీ తాజ్ప్యాలెస్ హోటల్ పేల్చేస్తామంటూ బెదిరింపు..సెక్యూరిటీ అలెర్ట్

ఢిల్లీ తాజ్ప్యాలెస్ హోటల్ పేల్చేస్తామంటూ బెదిరింపు..సెక్యూరిటీ అలెర్ట్

హైకోర్టుకు బాంబు బెదిరింపు ఘటన మరువకముందే ఢిల్లీ తాజ్ ప్యాలెస్ హోటల్ ను పేల్చేస్తామంటూ శనివారం( సెప్టెంబర్ 13) బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన భద్రతాదళాలు, పోలీసులు బాంబు స్క్వాడ్స్ బృందాలు హోటల్ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. హోటల్ లో బాంబు పెట్టామంటూ ఈమెయిల్ ద్వారా మెసేజ్ చేశారు దుండగులు. మెయిల్ ఎక్కడినుంచి వచ్చింది.. ఎవరు పంపారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

అంతకుముందు శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో భయాందోళలనకు గురయ్యారు. జడ్జీలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోర్టు భవనాన్ని ఖాళీ చేసి బయటికి వెళ్లిపోయారు.  కోర్టు పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు.. కోర్టు భవనంలో ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సరిగా 24 గంటల తర్వాత ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. క్షుణ్ణంగా పరిశీలించిన బాంబు స్క్వాడ్, పోలీసులు, భద్రతాబలగాలు హోటల్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తెలిపారు. 

ఈ వారం ప్రారంభంలో సీఎం సెక్రటేరియట్, ఎంఏఎంసి లను కూడా లక్ష్యంగా చేసుకున్న బాంబు బెదరింపులు వచ్చాయి. మంగళవారం ఢిల్లీ సీఎం సచివాలయం, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో అగ్నిమాపకదళాలు, బాంబు స్క్వాడ్ బృందాలు భారీ ఎత్తున తనిఖీలు చేశారు. 

గతంలో పాఠశాలలకు బెదిరింపులు..

ఢిల్లీలోని పాఠశాలలు,ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా బూటకపు బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే ఇవన్నీ నకిలీవని తేలింది. అయినప్పటికీ DDMA, ట్రాఫిక్ పోలీసులు,స్పెషల్ సెల్ వంటి భద్రతా సంస్థలు హై అలర్ట్‌లో ఉన్నాయి.

చాలా బెదిరింపులు తప్పుడు హెచ్చరికలే అయినప్పటికీ ప్రజా భద్రతకు ముప్పుగానే పరిగణించాలని పోలీసులు అంటున్నారు. అలెర్ట్ గా ఉంటూ స్నిఫర్ డాగ్‌లు, టెక్ బృందాలు ద్వారా ఎప్పటికీప్పుడు చెకింగ్ అవసరమని చెబుతున్నారు. ఈ బెదిరింపులు ఎక్కువగా నకిలీవే అయినప్పటికీ పటిష్టమైన భద్రతా చర్యలను నిర్ధారిస్తూ ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాతంగా ఉంచడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.