క్వెట్టా: బాంబు పేలుడుతో 16 మంది మృతిచెందిన సంఘటన పాక్ లో జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మరో 30 మందికి గాయాలయ్యాయి. హజర్ గంజి సబ్జీ మండీ ప్రాంతంలో హజర్ కమ్యూనిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ రద్దీగా ఉండే హజర్ గంజీ కూరగాయల మార్కెట్ లో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఒక్కసారిగా బాంబు పేలుడు జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారమందుకున్న భద్రతాసిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
గాయపడ్డవారిని హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. పేలుడు తీవ్రతతో చుట్టుపక్కల భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఇప్పటివరకు 16 మంది చనిపోయినట్లు తెలిపారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ప్రమాదంపై ఆరా తీస్తున్నామన్నారు పోలీసులు.