
వరుస సెంచరీలతో బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. శుభమన్ గిల్ బ్యాటింగ్, కెప్టెన్సీని పొగిడాడు. గిల్ను ఏకంగా ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ సర్ బ్రాడ్మన్తో పోల్చాడు.
స్కై స్పోర్ట్స్ ఛానల్తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఎడ్జ్ బాస్టన్లో గిల్ తన రెండు ఇన్నింగ్స్లలో దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్మాన్ లాగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. ఇది విదేశీ గడ్డపై ఒక భారత కెప్టెన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శనని పేర్కొన్నారు. బర్మింగ్హామ్ టెస్టులో గిల్ కెప్టెన్సీకి 10కి 10 మార్కులు ఇస్తున్నానని అన్నారు రవిశాస్త్రి.
హెడింగ్లీలో జరిగిన తొలి మ్యాచ్లో గిల్ కెప్టెన్సీ చాలా రియాక్టివ్గా ఉందని, అతను బంతిని ఫాలో అయ్యాడని పేర్కొన్నారు. కానీ ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 10 వికెట్లు తీసిన ఆకాష్ దీప్ లాంటి సీమర్ను జట్టులోకి తీసుకున్న గిల్ నిర్ణయాన్ని అభినందించారు. ఇంగ్లాండ్ పరిస్థితులకు ఆకాష్ దీప్ అనువైన పేసరని.. ఈ సిరీస్ మొత్తం అతడు ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా, తొలి టెస్టులో ఓటమికి భారీ ప్రతీకారం తీర్చుకుంటూ ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 58 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో తొలి విజయం సాధించింది. విదేశీ గడ్డపై టెస్టుల్లో రన్స్ పరంగా అతి పెద్ద విజయం సొంతం చేసుకొని ఔరా అనిపించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అత్యద్భుత బ్యాటింగ్కు తోడు ఆకాశ్ దీప్ (10/187) రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి పది వికెట్లతో కెరీర్ బెస్ట్ బౌలింగ్తో విజృంభించడంతో ఐదో రోజు, ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 336 రన్స్ తేడాతో ఇంగ్లండ్పై అఖండ విజయం అందుకుంది.