
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ అవార్డుకు ఎంపికయ్యారు ప్రధాని మోడీ. ఈ మేరకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మంగళవారం (జూలై 8) ఈ అవార్డును మోడీకి ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రపంచ వేదికలలో భారతదేశం-బ్రెజిల్ సహకారాన్ని పెంపొందించడానికి మోడీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందజేసినట్లు తెలిపారు.
ALSO READ | అకౌంట్లు బ్లాక్ చేయమని ఆదేశించలేదు: X ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్
'గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్' అవార్డు విదేశీ దేశాధినేతలకు మాత్రమే బ్రెజిల్ ప్రదానం చేస్తోంది. అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆదర్శవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా బ్రెజిల్ అందించే అత్యంత విశిష్ట అవార్డుల్లో ఇది ఒకటి. 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్' అవార్డు గతంలో అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసెన్హోవర్, క్వీన్ ఎలిజబెత్ II, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా వంటి అగ్ర ప్రపంచ నాయకులు అందుకున్నారు.
తాజాగా ప్రధాని మోడీ ఈ అవార్డు అందుకుని వారి సరసన చేరారు. 2014 మేలో భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మోడీ అందుకున్న 26వ అంతర్జాతీయ అవార్డు ఇది. ఇటీవల ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు కూడా ప్రధాని మోడీ ఆ దేశా అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేసిన విషయం తెలిసిందే.