అర్వింద్ చిల్లర మాటలు మానాలి : మహేశ్​గౌడ్

అర్వింద్ చిల్లర మాటలు మానాలి : మహేశ్​గౌడ్
  • దేవుళ్ల పేరుతో రాజకీయ పబ్బం

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ సంచలనాల కోసమే కామెంట్స్​చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్​కుమార్​గౌడ్​ విమర్శించారు. దేవుళ్ల పేరుతో ఇంకా ఎన్నాళ్లు రాజకీయ పబ్బం గడుపుతారని ప్రశ్నించారు. మోసాలతో పాలిటిక్స్​ చేసిన బీఆర్ఎస్​ఇక ఖాళీయేనన్నారు. లోక్​సభ ఎన్నికల్లో స్టేట్​లో 15 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గురువారం ఆయన డీసీసీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ జీవితంలో ఉన్నవాళ్లు హుందాగా ఉండాలని, ఎంపీ అర్వింద్​ తన చిల్లర మాటలను మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అర్వింద్ ​దేవుళ్ల పేరుతో రాజకీయం చేయాలని చూసినా, కోరుట్ల ప్రజలు తిప్పికొట్టారని, బీఆర్ఎస్​కల్లబొల్లి మాటలను సైతం రాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు. కుల, మతాలు ఆచార వ్యవహారాలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటిని చూపి ఓట్లడగడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.  మతాలను రెచ్చగొట్టి లాభం పొందాలని భావిస్తున్న ఎంపీ అర్వింద్​ను నిజామాబాద్​ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎవరికి ఎప్పుడు ఎలా వాతపెట్టాలో జిల్లా ప్రజలకు బాగా తెలుసని, ఇంకా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా లాభం లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు బాండ్​ రాసిచ్చి, మంజూరును ఇంకా కాగితాల్లోనే పెట్టారన్నారు. ఓట్ల కోసమే సరిగ్గా ఎలక్షన్​టైమ్​లో కేంద్రీయ పాఠశాల బిల్డింగ్​ఓపెనింగ్​చేశారన్నారు. పాలిటిక్స్​లో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ, మచ్చలేని మనిషిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డిని విమర్శించడం తగదన్నారు.

నిజామాబాద్​కు స్మార్ట్​ సిటీ హోదా ఎక్కడా?

హైదరాబాద్, వరంగల్ ​తర్వాత రాష్ట్రంలో అతిపెద్దదైన నిజామాబాద్ ​మున్సిపల్ ​కార్పొరేషన్​ను ఎంపీ అర్వింద్​ నిర్లక్ష్యం చేశారని మహేశ్​విమర్శించారు. కరీంనగర్ మున్సిపాలిటీ​ స్మార్ట్​ సిటీ హోదా ఎగరేసుకుపోయినా సోయిలేకుండా ఉన్నారన్నారు. కరీంనగర్​ హోదాను తాము వ్యతిరేకించడం లేదని, ఎంపీ అర్వింద్​ చేతగాని తనాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నామన్నారు. డీసీసీ ప్రెసిడెంట్​మానాల మోహన్​రెడ్డి, తాహెర్, గడుగు గంగాధర్, కేశవేణు పాల్గొన్నారు.