- ఫేక్ సర్టిఫికెట్లతో హైదరాబాద్ జోన్ పరిధిలో ఉద్యోగాలు
- నాన్ లోకల్ వారికీ సిటీలో బోనఫైడ్,స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లు
- 32 పోస్టుల్లో 20 మందికి పైగానకిలీ సర్టిఫికెట్లతో జాబ్స్
- అక్టోబర్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని డిస్కం
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థల్లో వెలుగుచూస్తున్న అక్రమ నియామకాల్లో తాజాగా మరో కోణం బయటపడింది. ఇప్పటికే ఓసారి లైన్మెన్ల నోటిఫికేషన్ రద్దు కాగా.. మరోసారి నిర్వహించిన పరీక్షలో ఫేక్ సర్టిఫికెట్లతో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ లోకల్ కాకపోయినా.. పలువురు అక్రమార్కులు ఫేక్ సర్టిఫికెట్లతో అడ్డదారిలో ఉద్యోగాలు పొందినట్లు విమర్శలు వస్తున్నాయి. దీనిపై కొందరు నిరుద్యోగులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా అప్పటి డిస్కం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
20 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు
గతేడాది ఫిబ్రవరి 23న లైన్మెన్ ఉద్యోగాలకు తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు నిర్వహించిన పరీక్షలో హైటెక్ మాస్ కాపీయింగ్ జరగడంతో పరీక్ష రద్దయింది. ఆ తర్వాత ఏప్రిల్ 30న రీ నోటిఫికేషన్ చేసి 1,553 లైన్మెన్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించారు. పరీక్షతో పాటు పోల్ క్లైయింబింగ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికెట్లతో హైదరాబాద్ లోకల్ పోస్టులను కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ జోన్ పరిధిలో 263 పోస్టులు శాంక్షన్ కాగా.. ఈ క్వాలిఫికేషన్తో పరీక్షలు పాస్ అయిన వాళ్లు ఈ జోన్ పరిధిలో తక్కువగా ఉన్నారు.
సాధారణంగా ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ నాలుగేండ్లు చదుకుంటే.. అక్కడి లోకల్ అభ్యర్థులుగా గుర్తిస్తారు. సదరన్ డిస్కం పరిధిలో జరిగిన లైన్ మెన్ పరీక్షల్లో హైదరాబాద్ జోన్లో పోస్టులు ఎక్కువగా ఉండి.. అభ్యర్థుల కాంపిటీషన్ తక్కువగా ఉంది. అభ్యర్థులు లేక బీసీ కేటగిరీలో పోస్టులు మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు అభ్యర్థులు లోకల్ కాకపోయినా హైదరాబాద్లో నాలుగేండ్లు చదివినట్లు ఫేక్ బోనఫైడ్ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు పొందారని నిరుద్యోగుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎస్టీ కేటగిరీలో 32 పోస్టులు హైదరాబాద్ జోన్ పరిధిలో ఉంటే.. 20 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరినట్లు ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలే...
హైదరాబాద్ జోన్లో లోకల్గా బోనఫైడ్, స్టడీ కండక్ట్ సర్టిఫికెట్తో పెద్ద ఎత్తున గోల్మాల్కు పాల్పడినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్కు చెందిన ఏడుగురు, నల్గొండ జిల్లాకు చెందిన ఆరుగురు, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇద్దరు, వరంగల్, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఒక్కో అభ్యర్థి ఫేక్ స్టడీ సర్టిఫికెట్ పెట్టారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై గత అక్టోబర్ 6న కొందరు నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బానోత్ శ్రీనివాస్, అంగోత్ ప్రశాంత్, జయపాల్, డిసెంబర్లో రమావత్ గిరిధర్ రాజు, హరిచరణ్ అనే నిరుద్యోగులు కంప్లైంట్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ అక్రమ ఉద్యోగులపై ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదు.
రికార్డులన్నీ మాయం ..
ఏ టెస్ట్లు రాయకున్నా విద్యుత్ సంస్థల్లో అడ్డదారిలో ఉద్యోగాలు పొంది, డ్యూటీ చేయకుండా లక్షల రూపాయలు వేతనాల రూపంలో కొల్లగొట్టిన విషయం ఇప్పటికే వెలుగు చూసింది. ఒక్కటొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తుండగా.. ఆ అక్రమాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ అధికారులు మాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ సంస్థల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడంతో అన్నీ చాపకింద నీరులా కొనసాగాయి. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు చేస్తే పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఎక్స్పర్ట్స్అంటున్నారు.