ఎస్సీ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంకా అందని బుక్స్

ఎస్సీ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంకా అందని బుక్స్
  • క్లాసులు మొదలై మూడు నెలలు
  • అన్ని కాలేజీలు, స్కూళ్లకు ప్రారంభంలోనే టెక్ట్స్ బుక్స్
  • ఇబ్బందిపడుతున్న విద్యార్థులు
  • పాత వాటితో అడ్జస్ట్ చేస్తున్న లెక్చరర్లు
  • వెంటనే బుక్స్ అందేలా చూడాలని పేరెంట్స్ విజ్ఞప్తి​

హైదరాబాద్, వెలుగు: విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఎస్సీ రెసిడెన్షియల్  కాలేజీలకు ఇంటర్​ పుస్తకాలు చేరలేదు. ఇతర ప్రభుత్వ కాలేజీలు, 10 వరకు గురుకులాల పాఠశాలలకు అకాడమిక్  ఇయర్  ప్రారంభంలోనే   టెక్స్ట్ బుక్స్​ చేరాయి. కానీ, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్​ చదివే విద్యార్థులకు మాత్రమే ఇంకా పుస్తకాలు అందలేదు. దీంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.​ ఎప్పుడు వస్తాయని అడిగితే లెక్చరర్లు  సమాధానం చెప్పలేకపోతున్నారు. అరకొరగా ఉన్న పాత బుక్స్​ తెప్పించి నలుగురైదుగురికి కలిపి ఒక్కో సెట్​ ఇచ్చారు. విషయం తెలిసిన పేరెంట్స్ .. ఈ విద్యా సంవత్సరంలో టెక్స్ట్​ బుక్స్​ అందిస్తారా? ఇవ్వరా? అని ఆఫీసర్లను నిలదీస్తున్నారు. 

238 కాలేజీలు.. 50 వేల మందికి పైగా విద్యార్థులు

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినవే ఎస్సీ గురుకులాలు. ప్రైవేటు కాలేజీల్లో లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేని వాళ్లంతా సర్కారు ఏర్పాటు చేసిన ఈ రెసిడెన్షియల్​ కాలేజీల్లో చేరడం ఆనవాయితీగా వస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా 75 బాయ్స్​, 122 గర్ల్స్​ ఇంటర్మీడియెట్ ​ కాలేజీలతో పాటు సీఓఈ పద్ధతిలో 17 బాయ్స్​, 20 గర్ల్స్​ రెసిడెన్షియల్​ కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటు ఇంటర్మీడియెట్​ కోర్సులతో కూడిన 37 వృత్తి విద్యా కాలేజీలు​నడుస్తున్నాయి.

 మొత్తం 238 ఎస్సీ గురుకుల కాలేజీల్లో  50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. మరోవైపు కొద్ది రోజుల్లోనే హాఫ్​ ఇయర్లీ ఎగ్జామ్స్​ దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని అధికారులకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

తెలుగు అకాడమీలో లేట్​ అవుతోందట..

నిజానికి  కాలేజీలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా గత వేసవిలోనే ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా గురుకులాల సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది.  

కాలేజీలు ప్రారంభమైన కొద్ది రోజులకే టీఎస్​ఆర్ఎస్​, బీసీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్​ కాలేజీలతో పాటు ప్రభుత్వ జూనియర్​ కాలేజీలు తమ దగ్గర ఉన్న సీట్ల సంఖ్యకు 10 శాతం అదనంగా పాఠ్యపుస్తకాలు కావాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులకు రిపోర్టులు అందజేశాయి. కాలేజీ ప్రిన్సిపాల్స్  నుంచి వచ్చిన విజ్ఞప్తుల ప్రకారం ఆయా గురుకులాల సెక్రటరీలు ఒకేసారి బుక్స్​  ప్రింటింగ్ కు ఆర్డర్లు ఇచ్చారు. దీంతో జూన్​లోనే  అన్ని కాలేజీలకు బుక్స్, నోట్​ బుక్స్​ అందాయి.

  కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ రెసిడెన్షియల్  కాలేజీలకు మాత్రం పాఠ్యపుస్తకాలు అందలేదు. దీనిపై ఆరా తీయగా.. ఆ శాఖ సెక్రటరీ ఆఫీసులోనే ఆలస్యం జరిగినట్లు తెలిసింది. పైగా తాము పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం తెలుగు అకాడమీకి ఇండెంట్​పంపించామని, అక్కడే లేట్​అవుతోందని ఆఫీసర్లు చెప్పారు.

త్వరలోనే పాఠ్యపుస్తకాలు అందజేస్తాం

ఎస్సీ రెసిడెన్షియల్​జూనియర్​ కాలేజీల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ కోసం తెలుగు అకాడమీకి ఇండెంట్​పంపించినం. అక్కడ లేట్​ అవుతోంది. అందుకే కొత్త బుక్స్​ కాలేజీలకు ఇంకా రాలేదు. ఈలోగా పూర్వ విద్యార్థుల నుంచి సేకరించిన పుస్తకాలను విద్యార్థులకు అందించి, విద్యాబోధన జరుపుతున్నాం. త్వరలోనే రాష్ట్రంలోని సొసైటీ పరిధిలోని అన్ని ఇంటర్​కాలేజీలకు కొత్త టెక్స్ట్​బుక్స్​ అందించేలా 
ఏర్పాట్లు చేస్తం. 

-సక్రు నాయక్​, జాయింట్​ సెక్రటరీ (అకాడమిక్) ఎస్సీ గురుకుల సొసైటీ -