న్యూఢిల్లీ: జీఎస్టీ తగ్గింపులు, టెక్ పెట్టుబడులు, భారీ డిమాండ్ కారణంగా అక్టోబర్లో భారతదేశ తయారీ రంగ కార్యకలాపాలు మరింత పెరిగాయి. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సెప్టెంబర్లో 57.7 ఉండగా, అక్టోబర్లో 59.2కి పెరిగింది. ఈ రంగం వేగంగా ఎదుగుతోందని ఇది సూచిస్తుంది.
పీఎంఐ 50 కంటే ఎక్కువ పాయింట్లు ఉంటే విస్తరణగా భావిస్తారు. కొత్త ఆర్డర్లు పెరగడానికి దేశీయ డిమాండ్ ప్రధాన కారణమని సర్వే వెల్లడించింది. ఇన్పుట్ ఖర్చులు తగ్గినప్పటికీ, తయారీదారులు పెరిగిన ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయడంతో సగటు అమ్మకం ధరలు పెరిగాయి. వరుసగా 20వ నెలలోనూ నియామకాలు కొనసాగాయని హెచ్ఎస్బీసీ తెలిపింది.
