- మూడు రోజుల కింద క్రికెట్ ఆడుతుండగా తగిలిన బాల్, ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి
- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలో ఘటన
దుగ్గొండి(నల్లబెల్లి), వెలుగు : క్రికెట్ ఆట ఓ బాలుడిని బలిగొంది. ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతుండగా బాల్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బాసాని మాధవి కుటుంబ గొడవల కారణంగా భర్తకు దూరమైంది.
ఈ క్రమంలో తన కొడుకు అనుచంద్ర (12)తో కలిసి తండ్రి ఆడెపు కొమురయ్య దగ్గర ఉంటోంది. అనుచంద్ర ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం అనుచంద్ర తన ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అనుచంద్ర తలకు బలంగా తగిలింది. గాయపడిన బాలుడికి కుటుంబసభ్యులు స్థానికంగా ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆదివారం బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగానే.. పరిస్థితి విషమించడంతో అనుచంద్ర చనిపోయాడు.
