షాపులో చోరీ చేశాడంటూ ఓనర్​ గొడవ.. ఉరేసుకున్న బాలుడు

షాపులో చోరీ చేశాడంటూ ఓనర్​ గొడవ.. ఉరేసుకున్న బాలుడు
  •    చనిపోయేముందు సెల్ఫీ వీడియో 
  •     సిరిసిల్ల జిల్లా కమ్మరిపేట తండాలో విషాదం 

కోనరావుపేట, వెలుగు : ఓ పిల్లవాడు షాపులో సిగరెట్ ప్యాకెట్ దొంగిలించాడని ఓనర్​ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో తల్లి కొడుకును కొట్టింది. మనస్తాపం చెందిన అతడు ఉరేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కమ్మరిపేట తండాకు చెందిన భూక్యా రాజు, జ్యోతి దంపతుల కొడుకు దినేశ్​(15) 9 తరగతి చదివి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. గ్రామంలోని షాపులో గురువారం దినేశ్ సిగరెట్ ప్యాకెట్ దొంగిలించాడని ఓనర్​ అతడి ఇంటికి వెళ్లి గొడవ చేసింది. పంచాయితీ పెడతానని చెప్పడంతో గురువారం ఉదయం దినేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రమైనా రాకపోవడంతో వెతకగా వట్టిమల్ల శివారులోని దుర్గమ్మ ఒర్రె దగ్గరున్న చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. తమ కొడుకు చావుకు షాపు ఓనరే కారణమని మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.

ఉన్నోళ్ల కడుపుల పుట్టాలె 

మృతుడు దినేశ్​ఉరేసుకునే ముందు సెల్పీ వీడియో తీసుకున్నాడు. అందులో..‘ అన్నా...నేను దొంగతనం చేసిన్నని అమ్మ కొట్టింది. దానికేం బాధలేదన్నా..అమ్మే కదా.. కానీ, వేరే వాళ్లు అనే మాటలకు బాధగా ఉందన్నా...బతుక బుద్ధి అయితలే..అన్నా. చెల్లెను, అమ్మను, నాన్నను బాగా చూసుకో. చచ్చిపోతా అన్నా.. ఈ కుక్క బతుకు బతుకా..పుడితే గొప్పోళ్ల ఇంట్ల పుట్టాలె..లేకపోతే ఉన్నోళ్ల కడుపుల పుట్టాలే’ అంటూ ఉరేసుకున్నాడు.