- ఓఐఎల్, ఎన్ఆర్ఎల్, ఫ్యాక్ట్తో ఒప్పందాలు
- ఏపీలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్
హైదరాబాద్, వెలుగు: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్), నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్) ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్)తో మంగళవారం హైదరాబాద్లో మూడు అవగాహన ఒప్పందాలపై (ఎంఓయూలు) సంతకాలు చేసింది. బీపీసీఎల్, ఓఐఎల్లు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు సమీపంలో రాబోయే గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అభివృద్ధిలో సహకారం కోసం ఒక నాన్-–బైండింగ్ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఎన్ఆర్ఎల్ తన సామర్థ్యాన్ని 3 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) నుంచి 9 ఎంఎంటీపీఏ కు విస్తరించిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తులను తరలించడానికి బీపీసీఎల్, ఓఐఎల్, నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్) ఒప్పందం చేసుకున్నాయి. సిలిగురి నుంచి ముజఫర్పూర్ మీదుగా మొఘల్ సరాయ్ వరకు 700- కిలోమీటర్ల క్రాస్- కంట్రీ ప్రొడక్ట్ పైప్లైన్ను కలిసి నిర్మిస్తారు.
దీని అంచనా పెట్టుబడి రూ. 3,500 కోట్లు. బీపీసీఎల్ తన గ్రీన్ ఎనర్జీ వేస్ట్- టు- ఎనర్జీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్)తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. కొచ్చి రిఫైనరీ సమీపంలోని బ్రహ్మపురంలో రాబోయే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ (ఎంఎస్డబ్ల్యూ) ఆధారిత కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ నుంచి ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు, లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు సరఫరా, ట్రేడింగ్ కోసం ఈ ఒప్పందం కుదిరింది.
