ఫోన్ పే నుంచి లంచం.. ఇద్దరు వీఆర్ఏల సస్పెన్షన్

ఫోన్ పే నుంచి లంచం.. ఇద్దరు వీఆర్ఏల సస్పెన్షన్

జీడిమెట్ల, వెలుగు: లంచం తీసుకున్న కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసుకు చెందిన  ఇద్దరు వీఆర్ఏలు సస్పెన్షన్​కు గురయ్యారు. మేడ్చల్​ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్​ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ గాజులరామారంలోని దేవేందర్​నగర్​లో వెలిసిన 250పైగా ఇండ్లను అధికారులు మంగళవారం కూల్చివేశారు. అయితే, కబ్జాదారుల నుంచి లంచాలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారని కుత్బుల్లాపూర్ వీఆర్ఏలు నాగేందర్, దేవేందర్​పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కబ్జాదారుల నుంచి ఫోన్​పే ద్వారా ఇద్దరు వీఆర్ఏలు  లంచం తీసుకున్నట్లు తేలడంతో వారిని సస్పెండ్​ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్డగోలుగా లంచాలు తీసుకున్న కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసుకే చెందిన మరో వీఆర్ఏ వాసు ఇటీవల బ్యాంకాక్​లో గ్యాంబ్లింగ్ గేమ్ లో దొరికి సస్పెండ్ గురైన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత మరో ఘటనలో ప్రభుత్వ భూమి కబ్జాకు గిర్దావర్ పరమేశ్వర్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. తాజాగా వీఆర్ఏలు దేవేందర్, నాగేందర్ ఫోన్ పే ద్వారా లంచాలు తీసుకుని సస్పెండ్​కు గురవడంతో కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసులో వేటు పడిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. అయితే, దేవేందర్​నగర్​లో రూ.వందల కోట్ల కుంభకోణంలో కేవలం కింది స్థాయి సిబ్బందిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు ఇచ్చిన డబ్బు వివరాలు, ఇచ్చిన ప్రదేశం, అధికారుల డ్రైవర్ల అకౌంట్లలో సైతం డబ్బులు వేశామని కబ్జాదారులే స్వయంగా వీడియోల్లో చెబుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదని జనం మండిపడుతున్నారు. కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.