ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
  • కలెక్టరేట్‌‌లోని ఆఫీస్‌‌లను తనిఖీ చేసిన నారాయణరెడ్డి
  • అనధికారికంగా గైర్హాజరైన ఉద్యోగి సస్పెన్షన్  

నిజామాబాద్,  వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్​సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. కొత్త కలెక్టరేట్‌‌లోని ఆఫీస్‌‌లను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాఖల వారీగా అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సుధీర్ కుమార్ అనధికారికంగా గైర్హాజరు కావడంతో అతడికి మెమో జారీ చేసి సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ, శ్రద్ధగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆఫీస్‌‌తో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వివిధ శాఖల్లోని రికార్డులు, ఫైల్స్‌‌ భద్రత కోసం కిటికీలకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయించాలన్నారు. ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యాంటీన్‌‌ను పరిశీలించి ధరల్లో పారదర్శకత పాటించాని నిర్వాహకులను ఆదేశించారు. ఆఫీస్ సముదాయ నిర్వహణను మరింత మెరుగుపర్చాలని ఏజెన్సీ నిర్వాహకులను సూచించారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

ఆర్డీవో ఆఫీసు ముందు అంగన్‌‌వాడీల ధర్నా

బోధన్, వెలుగు: బోధన్ ఆర్డీవో ఆఫీసు ముందు అంగన్‌‌వాడీ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జె.శంకర్‌‌‌‌గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారంగా అంగన్‌‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, బకాయి ఉన్న రెండు నెలల ఏరియల్‌‌ను వెంటనే చెల్లించాలని, సీలిండర్ల, కూరగాయాలు, టీఏడీఏలు, సెంటర్ల అద్దెలు,కరెంటు బిల్లులు  చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఫీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్‌‌‌‌మెంట్‌‌ అయిన అంగన్‌‌వాడీ టీచర్లకు రూ.5 లక్షలు, ఆయాలకు రూ.3 లక్షల బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. కనీస  వేతనం రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాణి, మేరీ, శివకుమారి, తైసిన్, లావణ్య, రేణుక, వత్సల, సవిత, సత్యగంగా, పద్మ, మంగ, అనంతలక్ష్మి, కరుణ, శ్యామల, వివిధ మండలాలలకు  చెందిన అంగన్‌‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.   

  • తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించాలి
  • మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాములు

బోధన్, వెలుగు: మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించి గ్రూపుల అభివృద్ధికి సహకరించాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాములు సూచించారు. గురువారం బోధన్​పట్టణ మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాల సభ్యులు బ్యాంక్‌‌లు, స్త్రీ నిధి, సమాఖ్యల నుంచి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించాలన్నారు. ముందుగా సమావేశంలో పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు జి.రాణి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో పట్టణ సమాఖ్య నిర్వహించిన ఆర్థిక కార్యకలాపాలు వార్షిక నివేధికను చదివి వినిపించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,71,442 మిగులను సాధించినట్లు తెలిపారు. అనంతరం గత సంవత్సరం ఉన్న పదాధికారులనే మళ్లీ తిరిగి ఎంపిక చేసుకున్నారు. అధ్యక్షురాలిగా గట్టు రాణి, కార్యదర్శిగా ఫర్హీన్, కోశాధికారిగా పిల్లి జ్యోతి, సహాయ కార్యదర్శిగా హసీనా, ఉపాధ్యక్షులుగా రిహానఫీర్ దోస్‌‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూబీఐ బ్యాంక్ మేనేజర్ వెంకటశేఖర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రంజత్, మెప్మా జిల్లా సమన్వయకర్త మాధురిలత, పట్టణ అధికారి ప్రసాద్, మెప్మా  టీఎంసీ శ్రీనివాస్, సీవోలు సరిత,అశోక్, ఆర్పీలు పాల్గొన్నారు.

ఆర్మూర్‌‌‌‌లో బేస్ బాల్ ట్రైనింగ్​ క్యాంప్​ 

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌‌లో గురువారం మాస్టర్ బేస్ బాల్ (అండర్-12) బాయ్స్ ట్రైనింగ్ క్యాంప్‌‌ను ప్రారంభించినట్లు ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.మధుసూదన్‌‌రెడ్డి తెలిపారు.  క్యాంప్‌‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 27 నుంచి 29 వరకు హైదరాబాద్‌‌లో జరిగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజన్ పోటీలకు సెలెక్ట్‌‌ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ దుర్గారెడ్డి, జిల్లా పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ బొజ్జ మల్లేశ్‌‌గౌడ్, జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ కె.నరేంద్రచారి, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ మర్కంటి గంగామోహన్, కోచ్ నరేశ్, మేనేజర్ అజయ్, పీఈటీలు రాజేందర్, అర్జున్ పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు కోసం స్టూడెంట్ల ధర్నా

కామారెడ్డి, వెలుగు: రామారెడ్డి మండలంలోని పలు ఊర్లకు ఆర్టీసీ బస్సు రావడం లేదని నిరసిస్తూ గురువారం పొశానిపేటలో స్టూడెంట్లు, స్థానికులు ధర్నా నిర్వహించారు. సరైన టైంకు బస్సు రాకపోవడంతో తాము కాలేజీకి వెళ్లలేకపోతున్నామని, పలుమార్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని పేర్కొన్నారు. పొశానిపేట,  మోషంపూర్, గిద్ద, ఉప్పల్​వాయి స్టూడెంట్లు ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, కామారెడ్డి ఆర్టీసీ డీఎం పొశానిపేట సర్పంచ్ మహేందర్‌‌‌‌రెడ్డితో ఫోన్‌‌లో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

‘కేటీఆర్ జిమ్మిక్కు రాజకీయాలు మానుకో’

నిజామాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, మంత్రి కేటీఆర్ ఎన్ని జిమ్మిక్కు రాజకీయాలు చేసినా గెలిచేది బీజేపీనే అని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌‌లో గురువారం ఆయన నిజామాబాద్ అర్బన్ లీడర్లతో కలిసి కలసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ధన్‌‌పాల్‌‌ కేటీఆర్‌‌‌‌ బెదిరింపు రాజకీయాలు ఎక్కువ కాలం చేయవన్నారు. మునుగోడులో టీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఓటమి తప్పదన్నారు.  ఈ ఎన్నిక తర్వాత రాష్ట్రంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, పంచరెడ్డి శ్రీధర్, గోపిడి వినోద్‌‌రెడ్డి, గట్టు గంగాధర్, పోలీస్ శ్రీనివాస్, బట్టికరి ఆనంద్, దాత్రిక రమేశ్‌‌, అమందు విజయ్, భాస్కర్‌‌‌‌రెడ్డి, ఆశిశ్‌‌, సాయికుమార్, అక్షయ్, నరేశ్‌‌గౌడ్, సాయి పాల్గొన్నారు.

ఈఎస్‌‌ఐ హాస్పిటల్ కోసం ధర్నా

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈఎస్​ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎల్టీయూ ( బహుజన బీడీ కార్మిక సంఘం) ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.  కామారెడ్డి ఏరియాలో బీడీ కార్మికులు లక్ష మంది వరకు ఉన్నారని, ఇతర సంస్థల్లో వేలాది మంది కార్మికులు ఉన్నారని తెలిపారు. హాస్పిటల్ లేక వీరంతా ఇబ్బందులు ఎడుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏవో రవీందర్‌‌‌‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఎల్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ దండి వెంకటి, జనరల్ సెక్రటరీ ఎస్.సిద్దిరాములు, జిల్లా ప్రతినిధులు ఆంజనేయులు, సదానందం, గంగామణి, మధు పాల్గొన్నారు. 

రాహుల్‌‌ యాత్రను సక్సెస్‌‌ చేద్దాం

పిట్లం, వెలుగు: ఈనెల 23 నుంచి నవంబర్ 7 వరకు రాష్ట్రంలో జరిగే రాహుల్ గాంధీ భారత్​జోడో యాత్రను విజయవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ జుక్కల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ ఇమ్రోస్‌‌ కోరారు. గురువారం పిట్లంలో నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌ ఆయన మాట్లాడారు. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతుందని చెప్పారు. దేశ ప్రజల ఐక్యత కోసం యాత్ర చేస్తున్న రాహుల్‌‌కు అందరం అండగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​జిల్లా జనరల్ సెక్రటరీ భాస్కర్‌‌‌‌రెడ్డి, యూత్ ప్రెసిడెంట్లు సందీప్, మధుసూదన్‌‌రెడ్డి, అశోక్, నగేశ్‌‌, మునీర్, నేహాల్, మహమ్మద్ పాల్గొన్నారు.

రైతులను పట్టించుకోని టీఆర్‌‌‌‌ఎస్‌‌

నిజామాబాద్, వెలుగు:  నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులను పట్టించుకోలేదని బోధన్ బీజేపీ నాయకుడు వడ్డి మోహన్‌‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్‌‌ ప్రెస్ క్లబ్‌‌లో గురువారం ఏర్పాటు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేశారు. నల్గొండ, రాయచూరు ఇతర  ప్రాంతాల్లోని రైస్ మిల్లర్లు జిల్లాలో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్లు తడవకుండా సర్కార్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఖరీఫ్​లో గతేడాది కంటే ఈసారి వరి సాగు పెరిగిందన్నారు. దిగుబడి ఎక్కువగా ఉందన్నారు. వడ్లకు డిమాండ్​ఉన్నందున మద్దతు ధర వచ్చేలా చూడాలని జిల్లా అధికారులను కోరారు. రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం అందిస్తున్నప్పటికీ విత్తనాలపై సబ్సిడీలు తొలగించడంతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. యాసంగిలో సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో  రెంజల్ జడ్పీటీసీ విజయ సంతోష్, చెన్నపల్లి జన్నాపల్లి మాజీ సర్పంచ్ రచ్చ సుదర్శన్, ఎడపల్లి మండల అధ్యక్షుడు కమలాకర్‌‌‌‌రెడ్డి, సత్యం రెడ్డి, రమణారావు, బోధన్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఆర్మూర్, వెలుగు: ఖరీఫ్‌‌లో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, కడ్తా లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు జేఏసీ కన్వీనర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం ఆర్మూర్‌‌‌‌లోని కుమార్ నారాయణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వరి కొనుగోలులో కడ్తా లేకుండా కొనుగోలు చేయాలని, వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.20 వేల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. పాలకులు కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడి దారులకు రూ.లక్షల కోట్లు బ్యాంకుల రుణాల మాఫీ చేసి వాళ్ల ఏజెంట్లుగా మారుతున్నారని మండిపడ్డారు. పాలకుల విధానాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రజా ఉద్యమించాలన్నారు. సమావేశంలో రైతు జేఏసీ నాయకులు బి.దేవారం, మంథని గంగారాం, జె.లింగారెడ్డి, పి.రామకృష్ణ, ఎస్.సురేశ్‌‌, జి.కిషన్, గంగాధర్ పాల్గొన్నారు. 

ఇందూర్ బీఎడ్ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి

బోధన్, వెలుగు: నిబంధనలు పాటించని ఇందూర్ బీఎడ్ కాలేజీని వెబ్ ఆప్షన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్‌‌బీ, జీవీఎస్, టీయూవీయూలకు చెందిన స్టూడెంట్ యూనియన్లు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ ఇందూర్ బీఎడ్ కాలేజీ పేరు మీదుగా అఫిలియేషన్ తీసుకుని ఎన్సీటీఈ  నిబంధనలు  పాటించకుండా ఒకే కాలేజీలో డైట్, ఎంబీఏ నడుపడం విడ్డురంగా ఉందన్నారు. కాలేజీలో అర్హతలకు అనుగుణంగా స్టాఫ్​లేరని, విద్యార్థుల నుంచి డోనేషన్లు, అటెండెన్స్, డెవలప్‌‌మెంట్‌‌ పేరుతో ఫీజలు వసూళ్లు చేసి దోపిడీ చేస్తున్నారని మండ్డిపడ్డారు. అధికారులు రీ ఇన్‌‌స్పెక్షన్ జరిపి గుర్తింపును రద్దు  చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్​ఎఫ్​ జిల్లా కార్యదర్శి  రఘురాం,  విద్యార్థి సంఘాల నాయకులు మహేశ్‌‌, లాలాసింగ్, జైత్రం, రాచకొండ విఘ్నేష్, అంజలి, నాగరాజు, సంజయ్​తలారే, ఉదయ్, రాకేశ్‌‌, స్వాత్విక్, వంశీ, రాజన్న, గంగ శంకర్, ప్రశాంత్, దినేశ్‌‌ పాల్గొన్నారు.  

పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలి

నందిపేట, వెలుగు: టీచర్లు పాఠశాలల్లో బేసిక్స్ కాన్సెప్ట్‌‌ను అభివృద్ధి చేసి, పిల్లలకు అర్థమయ్యేలా బోధన చేయాలని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ నర్రా రామారావు సూచించారు. మండలంలోని కుద్వాన్‌‌పూర్‌‌‌‌, అయిలాపూర్, కౌల్‌‌పూర్‌‌‌‌ గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా టీచర్లకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యసనా స్థాయిలను అభివృద్ధి చేయాలని అందుకే ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీని (ఎఫ్‌‌ఐఎన్‌‌) తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల నోడల్​ అధికారి ద్రుపతి కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రవీణ పాల్గొన్నారు.