తమ్ముడితో వీడియో కాల్ మాట్లాడుతూనే పురుగుల మందు తాగి అన్న ఆత్మహత్య

తమ్ముడితో వీడియో కాల్ మాట్లాడుతూనే పురుగుల మందు తాగి అన్న ఆత్మహత్య

పెబ్బేరు, వెలుగు: ఆర్థిక, అనారోగ్య కారణాల తో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది.  పెబ్బేరు ఎస్ఐ యుగంధర్​ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా గుత్తి మండలం పి. కొత్తపల్లికి చెందిన రేవంత్​కుమార్​(27) ఈనెల14న  బొలెరో వెహికల్‎లో మిర్చి లోడ్​తో నిజామాబాద్​ వెళ్లాడు. మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల సమయంలో తన తమ్ముడు కిరణ్​ కుమార్​కు వీడియోకాల్​ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. అతడు చేసిన అప్పుల లెక్కల వివరాలు నోట్​బుక్‎లో రాసి ఇంట్లో పెట్టానని, ఉన్న భూమిని అమ్మి తీర్చాలని సూచించాడు. 

అమ్మ జాగ్రత్త అంటూ.. తమ్ముడితో  వీడియోకాల్‎లో మాట్లాడుతూనే  పురుగుల మందు తాగాడు.  రేవంత్​ పెబ్బేరు వద్ద ఉన్నట్లు లోకేషన్ లో చూపించడంతో పీఎస్​కు సమాచారం ఇచ్చారు. పోలీసులు కొత్తకోట బైపాస్​ వద్ద ఆగిన బొలెరో వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతడు చనిపోయినట్లు గుర్తించారు. బుధవారం తమ్ముడు కిరణ్​ కుమార్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.