రాఖీ పండుగ సందర్భంగా తన సోదరికి గిఫ్టుగా సైకిలు ఇస్తానని మాటిచ్చాడు ఓ సోదరుడు. అయితే, చెల్లితో రాఖీ కట్టించుకున్నాడు కానీ, సైకిల్ ను మాత్రం కొనివ్వలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. అలా ఆ ఇంట్లో రాఖీ పండుగ రోజున విషాదం నిండుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కొదాన్ పూర్వ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పుట్టిలాల్(22) అనే యువకుడు ఆత్మహత్య చేసున్నాడు. చెల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు పుట్టిలాల్ వద్ద సమయానికి డబ్బులు లేకపోవడంతో.. పండుగ రోజున చెల్లికి గిఫ్ట్ ఇవ్వలేదని అతడు కుంగిపోయాడు. దీంతో ఇంట్లోంచి వెళ్లి బర్రాజ్ పూర్ రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలుకు అడ్డంగా నిలబడి పుట్టిలాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లికి గిఫ్ట్ ఇవ్వకపోవడంతోనే పుట్టిలాల్ రెండ్రోజులుగా బాధగా ఉన్నట్లు అతడి స్నేహితులు చెప్పారు. ఇదే కారణంతో చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.