
పంచాయితీలో న్యాయం చేయలేదని మేనమామను చంపేసిండు
హుజూర్నగర్, వెలుగు: చెల్లెలు, బావ మధ్య పంచాయితీలో న్యాయం చేయలేదంటూ గొడవకు దిగి మేనమామను హత్యచేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం గోపాలపురంలో జరిగింది. సీఐ శివశంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామంలోని బుడిగె జంగాల కాలనీకి చెందిన పస్తం సైదులు, శైలజకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పంచాయితీ కులపెద్దల వద్దకు చేరింది. ఇందులో భార్యాభర్తల ఇద్దరి తప్పు ఉందంటూ తీర్మానించి కులపెద్దలు ఇద్దరికి కులాచారం ప్రకారం జరిమానా విధించారు. అదేరోజు రాత్రి శైలజ అన్న చార్ల రాజు ఫూటుగా మద్యం తాగి పంచాయితీలో తన చెల్లెలికి అన్యాయం చేశారంటూ కులపెద్ద, మేనమామ తిరపయ్య కొడుకైన పస్తం ఆనంద్ ఇంటికి వెళ్లి తిడుతూ దాడికి దిగాడు. అడ్డువెళ్లిన మేనమామ తిరపయ్య తలపై రాజు రాయితో గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పట్టణంలోని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. నిందితుడు రాజు, అతని భార్య పరారీలో ఉన్నారు.
For More News..