
నర్సాపూర్, వెలుగు: భూమి విషయంలో కుటుంబసభ్యుల మధ్య మొదలైన గొడవ చినికి చినికి గాలి వానలా మారి దాడులు చేసుకునే వరకు వెళ్లింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్ చెందిన పిచ్చకుంట్ల బాలయ్య, లింగయ్య, రాములు అన్నదమ్ములు. వీరికి చెందిన ఎకరం భూమి నడిపివాడైన లింగయ్య పేరుపై ఉంది. వారం రోజులుగా ఎకరం భూమి అందరికీ సమానంగా రిజిస్ట్రేషన్ చేయించుకుందామని కుటుంబసభ్యులు మాట్లాడుకున్నారు.
అయితే లింగయ్య మనవళ్లు దీనికి నిరాకరించారు. ఈ విషయమై గ్రామంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించారు. గ్రామ పెద్దలు నచ్చజెప్పగా, శుక్రవారం అగ్రిమెంట్ చేసుకునేందుకు నర్సాపూర్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్బంగా మాట మాట పెరగడంతో కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.