- నియోజకవర్గ ఇన్చార్జులుగా నియమించిన కేసీఆర్
- మొత్తం 54 నియోజకవర్గాలకు ఇన్చార్జుల నియామకం
- జనగామ బాధ్యతలూ హరీశ్కే అప్పగింత
- కవితకు నిజామాబాద్ అర్బన్ బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ చార్జులను బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ నియమించారు. 54 నియోజకవర్గాలకు ఇన్చార్జులు, సహ ఇన్చార్జులను నియమిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్గా మంత్రి కేటీఆర్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్గా మంత్రి హరీశ్ రావుకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. కామారెడ్డిలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను.. గజ్వేల్లో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిని సహ ఇన్చార్జులుగా నియమించారు. మంత్రి హరీశ్రావుకు జనగామ ఇన్చార్జ్గానూ బాధ్యతలు అప్పగించారు.
ఈ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, స్టేషన్ఘన్పూర్ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను సహ ఇన్చార్జులుగా నియమించారు. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్అర్బన్, మంత్రి గంగుల కమలాకర్ కు చొప్పదండి, ఎంపీ రంజిత్రెడ్డికి చేవెళ్ల, వికారాబాద్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కు కంటోన్మెంట్, మండలి డిప్యూటీ చైర్మన్బండా ప్రకాశ్ కు వరంగల్ఈస్ట్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు మధిర బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను నియోజకవర్గ ఇన్చార్జులుగా నియమించారు.
ఇంటింటికీ తిరగాలి: కేటీఆర్
పదేండ్ల బీఆర్ఎస్పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఎన్నికల్లో పార్టీకి సానుకూల వాతావరణం ఉందని కేటీఆర్అన్నారు. నియోజకవర్గాల ఇన్చార్జులతో ఆయన గురువారం టెలీ కాన్ఫరెన్స్నిర్వహించారు. తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికీ బ్రహ్మరథం పడ్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇంటింటికీ తిరుగుతూ మనం ఏం చేశామో ప్రజలకు వివరించాలి. ఎన్నికల వరకు ప్రజలతోనే మమేకం కావాలి” అని ఇన్ చార్జులకు సూచించారు. వెంటనే బాధ్యతలు చేపట్టాలన్నారు. పార్టీ గెలుపు కోసం అవసరమైన కార్యచరణ చేపట్టాల్సిన బాధ్యత ఇన్చార్జులపైనే ఉందన్నారు. శుక్రవారం నుంచి రిజల్ట్స్ప్రకటించే వరకు ఆయా నియోజకవర్గాల పూర్తి బాధ్యత ఇన్చార్జులదేనని తెలిపారు.
ప్రజల్లోనే ఉండాలి: హరీశ్
ఈ 45 రోజులు నియోజకవర్గాల ఇన్ చార్జులందరూ ప్రజల్లోనే ఉండాలని హరీశ్రావు సూచించారు. ‘‘బూత్స్థాయి కమిటీల ఏర్పాటు నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో ప్రచారం పకడ్బందీగా జరిగేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పదేండ్లలో ప్రభుత్వం చేసిన మంచిని చెప్తే బీఆర్ఎస్ఘన విజయం సాధించడం ఖాయం. ఎన్నికలను చాలెంజ్గా తీసుకోవాలి. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పని చేయాలి’’ అని దిశానిర్దేశం చేశారు.