
- సీఈఓ వికాస్ రాజ్కు బీఆర్ఎస్ ఫిర్యాదు
- రేవంత్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. కట్టడి చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ను కించపరిచేలా ఉన్న కాంగ్రెస్ యాడ్స్ను వెంటనే నిలిపివేయాలని, రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్న రేవంత్ని కట్టడి చేయాలని సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం బీఆర్కే భవన్లో సీఈఓను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను హింసాత్మకంగా మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదన్నారు.
ప్రతి మీటింగ్లో రేవంత్రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. ఆయన కామెంట్స్ వల్లే వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేటలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఇప్పటికీ సీరియస్ గానే ఉందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు జరుగుతుంటే.. రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇటువంటి ఘటనలు ఎక్కడా జరగలేదని, ఇప్పుడు ఎవరివల్ల జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రేవంత్ కు టీడీపీ తల్లి పార్టీ అయితే.. కాంగ్రెస్ అత్త పార్టీ అని, ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎంసీఎంసీ కమిటీకి చూపించిన యాడ్స్ ఒకలా.. బయట ప్రచారం చేస్తున్న యాడ్స్ మరోలా ఉన్నాయన్నారు. ఈ అంశాలపై ఈసీ క్లారిటీ ఇస్తే బాగుంటుందన్నారు.