సిరిసిల్లలో బీఆర్ఎస్​కు షాక్.. రిజైన్ చేసిన మున్సిపల్ మాజీ చైర్​పర్సన్​

సిరిసిల్లలో బీఆర్ఎస్​కు షాక్.. రిజైన్ చేసిన మున్సిపల్ మాజీ చైర్​పర్సన్​

సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సామల పావని, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. సామల పావని బుధవారం ఉదయం కామారెడ్డిలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పావనితో పాటు అంగన్​వాడీ జిల్లా అధ్యక్షురాలు కల్లూరి చందన తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ​ముస్తాఫా సైతం కాంగ్రెస్ లో చేరారు.  

కేటీఆర్​ ఓడిపోతడు : సామల పావని

కాంగ్రెస్​లో చేరిన సామల పావని సిరిసిల్ల ప్రెస్​క్లబ్​లో విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్ అనుచరులు, స్థానిక నాయకుల తీరు తనను బాధించిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా మున్సిపాలిటీ అభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు తన వంతు కృషి చేశానన్నారు. అయినా తనకు గుర్తింపు లేదన్నారు. మనసు చంపుకుని బీఆర్ఎస్ లో పని చేయలేక రిజైన్​ చేస్తున్నట్టు చెప్పారు. సిరిసిల్లలో ఈ సారి కేకే గెలుపు ఖాయమని, కేటీఆర్​ఓడిపోతారన్నారు. కేకే మహేందర్ రెడ్డి, వైద్య శివప్రసాద్, నాగుల సత్యనారాయణ, కాముని వనిత, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.