- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత క్యాడర్ సైలెంట్
- ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు
- అత్యధిక ఓట్బ్యాంక్ఉన్న గోషామహల్లోనూ ఇదే పరిస్థితి
- లోక్సభ ఎన్నికల్లో ఓట్లు భారీగా తగ్గుతాయని అంచనా
హైదరాబాద్, వెలుగు: ఓల్డ్సిటీలో బీఆర్ఎస్పార్టీ ఖాళీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ క్యాడర్పూర్తిగా సైలెంట్ అయింది. హైదరాబాద్లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. కొందరు అధికార కాంగ్రెస్ లో, మరికొందరు బీజేపీలో చేరుతున్నారు. గడిచిన పదేండ్లలో స్థానిక నేతలు గెలిచినా, ఓడినా పార్టీ అధికారంలో ఉండడంతో ఫుల్జోష్తో కనిపించిన బీఆర్ఎస్కింది స్థాయి నేతలు, ముఖ్య కార్యకర్తలు ఇండ్లకే పరిమితం అయ్యారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గోషామహల్లో బీఆర్ఎస్కు 58 వేల ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందకిషోర్ వ్యాస్ గెలుపు అంచుల దాకా వెళ్లారు. కాగా, ఆయన నెల కింద బీఆర్ఎస్ కు గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. స్థానికంగా నడిపించే నాయకుడు లేకపోవడంతో క్యాడర్ సైలెంట్అయింది. ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలంతా నామినేషన్లు, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే బీఆర్ఎస్ వర్గం ఎక్కడా కనిపించడం లేదు.
గోషామహల్లో ఢీలా..
హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్పూరా, యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలోని గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బలమైన ఓట్బ్యాంక్ఉంది. ఆ తర్వాతి స్థానంలో కార్వాన్, బహదూర్ పురా ఉన్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సేమ్సీన్రిపీట్ అయింది.
అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ యాక్టీవ్గా లేదు. క్యాడర్గప్చుప్అన్నట్లుగా ఉంది. గోషామహల్ మాదిరిగానే మిగిలిన నియోజకవర్గాల్లోని మాజీ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి లీడర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ముఖ్యనేతలు పార్టీ మారడంతో ఈసారి ఆ పార్టీకి ఓట్లు తగ్గుతాయని తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్పరిధిలో ఎంఐఎంకు 5,17,471 ఓట్లు రాగా, బీజేపీకి 2,35,285 ఓట్లు వచ్చాయి. మూడో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ కు 63,239 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 2019లో వచ్చినన్ని ఓట్లు కూడా రావని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో లక్షా68 వేల ఓట్లు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్సిటీలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు పడ్డాయి. మలక్పేటలో ఎంఐఎంకు 55,805 ఓట్లు రాగా, బీజేపీకి 23,731, కాంగ్రెస్కు 29,699, బీఆర్ఎస్ కు 15,516 ఓట్లు వచ్చాయి. కార్వాన్ లో ఎంఐఎంకు 83,388, బీజేపీకి 41,402, కాంగ్రెస్ కు 18,160 ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 29,194 ఓట్లు పడ్డాయి. గోషామహల్ లో బీజేపీకి 80,182 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు కేవలం 6,265 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్58,725 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. చార్మినార్లో ఎంఐఎంకు 49,103, బీజేపీకి 26,250, కాంగ్రెస్ కు10,899, బీఆర్ఎస్కు 8,874 ఓట్లు పడ్డాయి.
చాంద్రాయణగుట్టలో ఎంఐఎంకు 99,776 ఓట్లు రాగా, బీజేపీకి 16,414, కాంగ్రెస్ కు 14,589, బీఆర్ఎస్కు 18,116 ఓట్లు వచ్చాయి. బహదూర్పురాలో ఎంఐఎంకు 89,451, బీజేపీకి 11,621, కాంగ్రెస్కు14,448, బీఆర్ఎస్ కు 22,426 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక యాకుత్ పురాలో ఎంఐఎంకు 46,153, ఎంబీటీకి 45,275, బీజేపీకి 22,354 ఓట్లు పడగా, కాంగ్రెస్ కు 6,954, బీఆర్ఎస్కు 15,516 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్లోక్సభ స్థానంలో పోలైన ఓట్లను కలిపి చూస్తే ఎంఐఎంకు 4,23,676 ఓట్లు, బీజేపీకి 2,21,954, కాంగ్రెస్ కు 1,01,014 ఓట్లు, బీఆర్ఎస్ కు 1,68,367 ఓట్లు వచ్చాయి. మరి ఈసారి బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి ప్లస్ అవుతాయో చూడాలి.