
- రాష్ట్రంలోని బ్యారేజీలన్నీ కూలిపోవాలని సీఎం రేవంత్ కోరుకుంటున్నడు: ప్రకాశ్
- ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు వాస్తవాలు’ పేరిట బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్లే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చి ఉంటారనే అనుమానం ఉందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వీ. ప్రకాశ్ ఆరోపించారు. అధికారం కోసం ఏదైనా చేసే నైజం రేవంత్ రెడ్డిది అని ఆయన విమర్శించారు, 'కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు‒వాస్తవాలు' పేరిట సోమవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అధ్యక్షతన కాళేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రకాశ్ పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలోని బ్యారేజీలన్నీ కూలిపోవాలని సీఎం రేవంత్కోరుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. లేదంటే ఎన్నికలకు ముందే ఈ బ్యారేజీ కుంగిపోవాలా? అని ఆయన ప్రశ్నించారు. అనంతరం మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు రావాలనే దురుద్దేశంతో మేడిగడ్డ వద్ద కుంగిన మూడు పిల్లర్లను రిపేర్ చేస్తలేరని అన్నారు.
ఎన్నికల్లో గెలిచేందుకే కాళేశ్వరం కూలిందని కాంగ్రెసోళ్లు బద్నాం చేశారని అన్నారు. పాలన చేతగాక, అభివృద్ధి చేయలేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రేవంత్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవాస్తవాలను ప్రచారం చేస్తూ కేసీఆర్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.