- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వారికి లేదు
- వెలిచాల రాజేందర్ రావు ఫైర్
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ నేతలే దేశంలో అతి పెద్ద 420లని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఫైర్అయ్యారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పేదలకు ఒక్క డబుల్ బెడ్రూం కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా కరీంనగర్ లో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందిస్తోందని తెలిపారు. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
