కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్..బీఆర్ ఎస్ వరుస ఓటములే: మంత్రి వివేక్ వెంకట స్వామి

కేటీఆర్  ఫెయిల్యూర్ లీడర్..బీఆర్ ఎస్ వరుస ఓటములే: మంత్రి వివేక్ వెంకట స్వామి
  • ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 
  • ఆ పార్టీకి వరుస ఓటములే: మంత్రి వివేక్​
  • కేటీఆర్ నాయకత్వం కింద పనిచేయడంపై 
  • హరీశ్​ ఆలోచించుకోవాలి
  • జూబ్లీహిల్స్​లో సోషల్​ మీడియా హైప్​తో గెలవాలనుకున్నరు.. కానీ విఫలమయ్యారు
  •     బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయినా.. 
  • విజయం సాధించామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ఫెల్యూర్​ లీడర్ అని  మంత్రి వివేక్ ​వెంకటస్వామి అన్నారు. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పార్టీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నదని తెలిపారు. ఆయన నాయకత్వం కింద పనిచేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్​రావు ఆలోచించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్​ఉప ఎన్నికలో కాంగ్రెస్​అభ్యర్థి నవీన్​యాదవ్ విజయం తర్వాత వివేక్​వెంకటస్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

2019లో సారు, కారు, పదహారు నినాదంతో ఎంపీ ఎన్నికలకు వెళ్లీ బీఆర్ఎస్ 7 సిట్టింగ్​ సీట్లు కోల్పోయిందని తెలిపారు. తన సొంత చెల్లి కవితను సైతం కేటీఆర్ ​గెలిపించుకోలేక పోయారని విమర్శించారు. కేసీఆర్ ​తర్వాత తానే సీఎం అవుతానని ఆయన భావించారన్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని విమర్శించారు. ఆ తర్వాత జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైందని చెప్పారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లలో ఆ పార్టీ కనీసం అభ్యర్థిని నిలపలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ గెలవ లేదని.. కేటీఆర్ లీడర్ షిప్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీక్ స్టేజీ నుంచి చాలా స్ట్రాంగ్ అయ్యిందన్నారు.  జూబ్లీహిల్స్​లో 22 శాతం ప్లస్ ఓట్లతో బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ కంటే 14 శాతం తక్కువకు పడిపోయిందని తెలిపారు. జూబ్లీహిల్స్​ఉప ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసిపోయాయన్నారు. అయినా ఆ రెండు పార్టీలు  కాంగ్రెస్ ను ఏమీ చేయలేకపోయాయని చెప్పారు.

కేటీఆర్ నాయకత్వం అవసరమా? ఆలోచించుకోవాలి.. 

ఈ వరుస ఓటముల నేపథ్యంలో కేటీఆర్ లీడర్​ షిప్ పార్టీకి అవసరం ఉందా..? అని బీఆర్ఎస్  ఆలోచించుకోవాలని వివేక్ ​వెంకటస్వామి సూచించారు. కుటుంబలో ఆస్తుల పంచాయితీ నడుస్తున్నదని.. అన్నా, చెల్లి మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘వీక్ లీడర్ షిప్​తో కేటీఆర్, ఆయన బావ హరీశ్ మధ్య గొడవలు వచ్చే చాన్స్​ ఉంది. 

ఇద్దరిలో ఎవరు బెటర్ అనేది నిర్ణయించుకోవాలి. కేటీఆర్ పార్టీని నడిపించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఆయన వల్ల పార్టీకి లాభమా.. నష్టమా.. అనేది హరీశ్ ఆలోచించుకోవాలి.  కేటీఆర్ కింద పనిచేయాలా? అని హరీశ్ ఆలోచించుకునే టైమ్​ వచ్చింది. సోషల్ మీడియాలో హైప్​తో గెలుస్తామనుకున్నరు. కానీ అది కూడా ఫెయిల్​అయ్యింది. ప్రజలు సోషల్ మీడియాను ఫాలో అవుతారు. కానీ కేటీఆర్ లీడర్ షిప్​లో కంటెంట్ లేకుంటే ఎంత ఫాలో చేసినా.. లాభం లేదు’’ అని వివేక్ అన్నారు.