
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పూర్తయ్యాక రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, తాను హోంశాఖ అడుగుతున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను హోం మంత్రిని అయితేనే వాళ్లు(బీఆర్ఎస్ లీడర్లు) కంట్రోల్ లో ఉంటారన్నారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చిందే కేసీఆర్ను గద్దె దించేందుకేనన్నారు.
వాళ్లంతా జైలుకే
కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు బీజేపీయే శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారన్నారు. ఇక భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదన్నది తమ ఉద్దేశమన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని వివరించారు.