బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు తప్పిన ప్రమాదం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు తప్పిన ప్రమాదం

నిజామాబాద్ పట్టణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు  పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో మధ్యలోకి ఓ ప్రైవేట్ కారు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన కాన్వాయ్ లో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గణేష్ గుప్తాకు చెందిన సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే నిజామాబాద్‌కు తరలించారు. సమాచారం అందుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.