హైదరాబాద్, వెలుగు: ఇసుక అక్రమ రవాణా కోసం హుజూరాబాద్ నియోజకవర్గంలోని తణుగుల చెక్ డ్యామ్ను బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దానిని బ్లాస్ట్ చేసిన ఆనవాళ్లు చా లా క్లియర్గా ఉన్నాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగలేదని, రేవంత్ రెడ్డే బాంబులు పెట్టి పేల్చేశారని ఆరోపించారు. ఇప్పుడు చెక్ డ్యామ్నూ అలాగే కూల్చేశారన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
డ్యామ్ బ్లాస్ట్ అయినట్టు తాను చెప్పడం లేదని, డిప్యూటీ ఈఈనే ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఈ చెక్ డ్యామ్ను నిర్మించింది రాఘవ కన్స్ట్రక్షన్ అని, ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫేక్ లీడర్స్ ఉన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మాఫియా లీడర్లు మంత్రులయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇసుక దందాకు తెరలేపిందని, అక్రమ సంపాదన కోసం ఆ పార్టీ నాయకులు చెక్ డ్యామ్లను బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
