కేసీఆర్‌ సంపద సృష్టిస్తుంటే.. కేంద్రం అమ్మేస్తోంది : పల్లా

కేసీఆర్‌ సంపద సృష్టిస్తుంటే.. కేంద్రం అమ్మేస్తోంది : పల్లా

రాష్ట్రంలో శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరుగలేదని పల్లా అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఐఐటీ, గిరిజన యూనివర్సిటీ ఊసేలేదన్నారు. విభజన హామీలైన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అదానీకే కట్టబెబడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ సంపద సృష్టిస్తుంటే.. కేంద్రం మాత్రం ఉన్న సంపదను అమ్మేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ లక్ష్యాలు దేశం మొత్తం విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని పల్లా అన్నారు. ఐటీ రంగంలో 2 లక్షల 55 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దాదాపు 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు ఆర్థిక వృద్ధిరేటు 128 శాతం పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 11 లక్షల 48 వేల కోట్లకు చేరగా.. రాష్ట్రంలో తలసరి ఆదాయం 3 లక్షల 17 వేలుగా ఉందని వివరించారు.