న్యూఢిల్లీ, వెలుగు: మణిపూర్ అల్లర్లకు సంబంధించి పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సోమవారం లోక్సభ, రాజ్యసభలో ‘ఇండియా’ కూటమితో కలిసి నిరసన తెలిపారు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. అంతకు ముందు రాజ్యసభలో బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగ య్య యాదవ్, సంతోష్ కుమార్, కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు రూల్ 276 కింద నోటీసులిచ్చారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత ప్రతిక్షాలతో కలిసి బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ నేత కేకే పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తాము మణిపూర్ అంశంపై చర్చ కోరడం లేదని, దేశ ప్రజల ఆందోళనపై స్పందించాలని కోరుతున్నామని చెప్పారు. పార్లమెంట్కు ప్రధాని హెడ్గా ఉంటారు కాబట్టి మణిపూర్లో జరిగిన అసాధారణ ఘటనలపై మోదీ మాట్లాడాలని, అప్పుడే ఆ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎంపీలకు విప్ జారీ..
ఢిల్లీ సర్వీస్ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసింది. ఈ మేరకు సోమ వారం ఎంపీ జోగినిపల్లి సంతోష్ పేరుతో ఒక నోట్ రిలీజ్ అయింది. జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు రాజ్యసభకు తప్పక హాజరుకావాలని స్పష్టం చేసింది. అలాగే ఢిల్లీ సర్వీస్ ఆర్డినెన్స్పై ఓటింగ్ పూర్తయ్యే వరకు సభ నుంచి బయటకు రావొద్దని సూచించింది.
పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ఆందోళన..
ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీలు మణిపూర్ అల్లర్లపై ఆందోళన చేపట్టారు. అలాగే రాజ్యసభలో సస్పెండ్ అయి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తున్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, వెంకటేశ్ నేత, బీబీ పాటిల్, పార్థసారధి రెడ్డి పాల్గొన్నారు.