
- బార్డర్ గ్రామాల్లోని చిన్నాచితకా లీడర్లకు వల
- ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు
- పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇస్తున్నారనే ప్రచారం
నిర్మల్, వెలుగు: మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను విస్తరించే ఆలోచనలో ఉన్న పార్టీ పెద్దలు ఈ నెల 5న నాందేడ్ లో నిర్వహించబోయే బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభకు కనీసం 25 వేల మందిని తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర సరిహద్దునే ఉన్న నిజామాబాద్, నిర్మల్జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున భారీ చేరికలకు ప్లాన్ చేస్తున్నారు. కనీసం వెయ్యి మందికి గులాబీ కండువా కప్పేలా కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఐదు రోజులుగా మంత్రి ఐకే రెడ్డి మకాం..
నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన మంత్రులు ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, జోగు రామన్న, షకీల్ తదితరులకు బహిరంగ సభకు జనాలను తరలించే బాధ్యతలను అప్పగించారు. వీరంతా కనీసం 25వేల మందిని తరలించేందుకు వీలుగా వాహనాలను రెడీ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో పాటు నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ లీడర్లంతా అయిదు రోజులుగా మహారాష్ట్ర బోర్డర్ లో మకాం వేశారు. నాందేడ్ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ సభకు జనాల్ని ఆహ్వానిస్తున్నారు. సరిహద్దు గ్రామాలతో బంధుత్వం కలిగిన బీఆర్ఎస్లీడర్లను ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. గ్రామాలవారీగా చిన్నచిన్న మీటింగులు పెట్టి, తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి పథకాలతో పాటు ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతుబంధు, రైతు బీమా లాంటి స్కీముల గురించి వివరిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా వీటిని అమలు చేస్తామని వివరిస్తూ నాందేడ్ బహిరంగ సభకు ఆహ్వానిస్తున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్
నాందేడ్ సభలో కేసీఆర్సమక్షంలో కనీసం వెయ్యికి తగ్గకుండా చేరికలు ఉండేలా బీఆర్ఎస్ లీడర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ తదితర పార్టీల నుంచి చిన్నాచితక లీడర్లు, కార్యకర్తలను బీఆర్ఎస్లో చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మంత్రి ఐకే రెడ్డి ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి సమక్షంలో వారంరోజులుగా పలు గ్రామాలు చుట్టివస్తున్న లీడర్లు, చేరికల లిస్టులను రెడీ చేస్తున్నారు. గురువారం మంత్రి సమక్షంలో బోకర్ తాలూకా రాటి గ్రామ సర్పంచ్తో పాటు 100 మంది గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఇదే తాలూకాలోని అప్పారావుపేట, శివిని, కిని, పాలజ్, బోకర్, ధర్మాబాద్, హిమాయత్ నగర్ తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. గత ఎన్నికల్లో నాందేడ్ ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి పోటీచేసిన పాటిల్తో మంత్రి ఐకేరెడ్డికి చాలా ఏండ్లుగా పరిచయం ఉందనీ, ఆ సాన్నిహిత్యంతో ఆయన్ను కలిసి మీటింగ్కు సహకరించాలని కోరినట్లు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.