స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
  •     న్యాయపోరాటం చేస్తం.. వదిలేది లేదు: కేపీ వివేకానంద
  •     ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆత్మహత్య చేసుకోవాలి: కల్వకుంట్ల సంజయ్​

హైదరాబాద్​, వెలుగు: ట్రిబ్యునల్​ చైర్మన్​గా అసెంబ్లీ స్పీకర్​ పూర్తిగా విఫలమయ్యారని బీఆర్​ఎస్​ విప్​, ఎమ్మెల్యే కేపీ వివేకానంద  ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఏం కాదని గతంలో సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. ఆ మాటలనే ఇప్పుడు స్పీకర్​ తన తీర్పులో చెప్పారు. స్పీకర్​ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

 స్పీకర్​ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాం. న్యాయపోరాటం చేస్తాం” అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద  ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​తో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. కేవలం ఐదుగురిపైనే స్పీకర్​ తీర్పు ఇచ్చారని, మిగతా ఐదుగురి గురించి అడిగితే సరైన సమాధానం లేదని దుయ్యబట్టారు. ‘‘కడియం శ్రీహరి, దానం నాగేందర్​కు నోటీసులు ఇచ్చినా వాళ్లు ఇంకా స్పందించలేదు. 

వారిని అనర్హులుగా ప్రకటించాలి. జడ్జిమెంట్​ కాపీ అడిగితే ఇవ్వలేదు. త్వరలో అప్​లోడ్​ చేస్తామని చెప్పారు” అని వ్యాఖ్యానించారు.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆత్మహత్య చేసుకోవాలనిఎమ్మెల్యే  కల్వకుంట్ల సంజయ్​ అన్నారు. జడ్జిమెంట్​ ఆర్డర్​ కాపీ జూబ్లీహిల్స్​ ప్యాలెస్​ నుంచి వచ్చిందని, అక్కడే తీర్పును ఎప్పుడో నిర్ణయించేశారని ఆయన ఆరోపించారు.