- వాగువంకలు తెల్వని సీఎం..
- కేసీఆర్ కు నీళ్లగురించి చెప్తాడా?
- అసెంబ్లీ గౌరవసభకాదు... కౌరవ సభ, బూతుల సభఅని ఫైర్
- బీఆర్ఎస్ సర్పంచ్ల ఇంట్ల పంటం అంటే నడ్వదని వ్యాఖ్య
- మంచోడు చెడ్డాడని చూడొద్దు..
- కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు
- జనగామలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు సన్మానం
వరంగల్ / జనగామ అర్బన్ / రఘునాథపల్లి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ లు ఎగిరెగిరి పడ్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ, "మళ్లీ వచ్చేది మేమే.. మీ సంగతి చూస్తం.. ఖబడ్డార్" అంటూ హెచ్చరించారు. మంగళవారం జనగామ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. పెంబర్తి గ్రామ శివారు నుంచి జనగామ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ లు , వార్డు మెంబర్లను జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సన్మానించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి నీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదన్నారు. వాగులు, వంకలు, చెరువులు ఎక్కడున్నాయో తెల్వని సీఎం.. కేసీఆర్ కునీళ్ల గురించి చెప్తాడా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్పంచ్ లు .. ఖబడ్డార్
రాష్ట్ర అసెంబ్లీ.. గౌరవసభ కాదని.. అది కౌరవ సభ, బూతుల సభ అన్నారు. కేసీఆర్ ను మొలకెత్తనివ్వనని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. కానీ కాంగ్రెస్ ను తొక్కి తెలంగాణ రాష్ట్రాన్ని మొలిపించిన వ్యక్తి కేసీఆర్అని, ఆయనే కాబోయే సీఎం అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్రెడ్డికి గుండె ఆగుతుందన్నారు. రాహుల్ గాధీ లీడర్ కాదని అతను కేవలం రీడర్ అన్నారు. అందువల్లే ఎన్నికల సమయంలో హామీలు చదవివెళ్లాడని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపి తన పదవిని కాపాడుకుంటున్నాడని ఆరోపించారు.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినా కేసీఆర్
చేరదీస్తే.. దొంగగా మారాడన్నారు. సర్పంచ్ లను కాంగ్రెస్ పార్టీలో చేరాలని బెదిరిస్తారని, గ్రామాలకు నిధుల విషయంలో ఎవరి మెహ ర్బానీ అవసరంలేదన్నారు. డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లయినా అవి ఇప్పిస్తామని చెప్పారు.
ముత్తిరెడ్డి, తాటికొండ అలగని బుద్ధిమంతులు
జనగామ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలు బుద్ధి మంతులని, టిక్కెట్ ఎవరికిచ్చినా గెలిపించారని కేటీఆర్అన్నారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య సైతం మంచోళన్నారు. 'అన్నా టిక్కెట్ రేస్ నుంచి మీరు తప్పుకోండి అంటే తప్పుకున్నరు.
పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేశారు'అని చెప్పారు. జనగామ, స్టేషన్ ఘన్ పూర్ లో సైతం మొన్న అలానే గెలిపించారన్నారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలి.రాష్ట్రంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్.. రేపు వచ్చే మున్సిపాలిటీ, జడ్పీ సెమీ ఫైనల్.. 2028 అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని కేటీఆర్ కేడర్ కు సూచించారు. మొన్న గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ ల ఇంట్ల పంటం అంటే నడవదన్నారు. 'పార్టీ అధ్యక్షులు మీపైన బాధ్యతలు పెడ్తారు. తలొక్క వార్డు ఇన్ చార్జీ తీసుకోవాలే. తప్పకుండా తిరగాలే.
సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఒక్కొక్క ఓటరును ప్రసన్నం చేసుకుని గెలిచినట్లే.. మున్సిపాలిటీ గెలుపు కోసం పనిచేయాలే'అని తెలిపారు. రాబోయే మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అలుగుడు. గులుగుడు ఉండదని, పార్టీ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కారు గుర్తు కనపడితే.. పొడుగోడు పొట్టోడు, మంచోడు చెడ్డాడని చూడకుండా కళ్లుమూసుకుని ఓటు ఒత్తాలని అన్నారు. ఈ అలుగుడు గులుగుడు కూడా కేవలంటిక్కెట్ ఇచ్చేవరకు మాత్రమే ఉండాలని తేల్చిచెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, తదితరులున్నారు.
