- అదుపులోకి తీసుకున్న ఎన్నికల మానిటరింగ్ టీమ్
కంటోన్మెంట్, వెలుగు: ఓటర్లకు డబ్బులు పంచుతూ ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఎన్నికల మానిటరింగ్ టీమ్కు దొరికిన ఘటన బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బోయిన్పల్లి పరిధిలోని తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ సమీపంలో కొందరు వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు కంటోన్మెంట్ సెగ్మెంట్ ఎన్నికల మానిటరింగ్ టీమ్ కు సమాచారం అందింది.
నిఖిలేశ్ ఆధ్వర్యంలోని ఎన్నికల మానిటరింగ్ టీమ్ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్న న్యూబోయిన్ పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎం. భాస్కర్రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి నుంచి రూ.55 వేల 900 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ రెడ్డిని బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు. అతడిపై 171 బీ, 171ఈ, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోయిన్ పల్లి ఎస్సై నాగేంద్రబాబు తెలిపారు.