
బీఎస్పీ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే, రక్షించే పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజ్యాంగం ప్రకారమే పార్టీ నడుచుకుంటుందని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రవీణ్ కుమార్ పూలమాలవేసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ... ఆర్టికల్ 25 అన్ని మతాలకు స్వేచ్ఛనిచ్చిందని, అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలని చెప్పారు. మత విశ్వాసాలను అగౌరవ పరచడం, హేళన చేయడం తప్పని అన్నారు.
హిందు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ బైరి నరేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వనదేవతలైన సమ్మక్క సారలమ్మను హేళన చేసిన చినజీయర్ స్వామిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీరితో పాటుగా రామ్ గోపాల్ వర్మ, గరికపాటిలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బైరి నరేష్ కో న్యాయం, చినజీయర్ స్వామికి మరోక న్యాయం ఉండకూడదని చెప్పారు. బీసీలకో న్యాయము, అగ్రవర్ణాలకో న్యాయం ఉండకూడదన్న ప్రవీణ్ కుమార్ .. అందరికీ సమానంగా న్యాయం ఉండాలని సూచించారు.