
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంతో ఆయన్ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు..పలువురు బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖబడ్దార్ కేసీఆర్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై శాంతియుతంగా దీక్ష చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఎన్ని అరెస్టులు చేసినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను ఆపేది లేదన్నారు. గ్రూప్ 1తో పాటు..మిగతా పేపర్లు కూడా లీకయ్యాయని ఆరోపించారు. లీకైన ఎగ్జామ్స్ ను మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొత్తగా పరీక్షలు పెట్టేదాక నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. TSPSC కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నది కేసీఆర్ ఏజెంట్లే ఉన్నారన్నారు. పేపర్ లీకేజీపై CBI ఎంక్వైరీ చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును తెలంగాణ సమాజమంతా గమనిస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ కుటుంబానికి సంబంధం..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. లీకేజీ వ్యవహారం ఇప్పటికిప్పుడు జరిగింది కాదని..రెండు మూడేళ్లుగా లీకేజీ జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లీకులపై తెలంగాణ సీఎం కార్యాలయం, టీఎస్పీఎస్సీకి సంబంధాలున్నాయన్నారు. పేపర్ లీకేజీ కేసుకు బాధ్యత వహిస్తూ బోర్డు చైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీపై విద్యార్థులకు నమ్మకం పోయిందని..బోర్డు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.