- విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ, ఎంఫిల్ తదితర ఉన్నత అర్హతలు ఉంటే అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ లెక్చరర్లుగా పనిచేసి.. ‘రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్’పద్ధతిలో డిగ్రీ కాలేజీలకు వచ్చిన వారికి ఇది పెద్ద ఊరటనిచ్చింది.
గతంలో జేఎల్ నుంచి డిగ్రీ లెక్చరర్గా వెళ్తే.. దాన్ని కేవలం ప్రమోషన్ గానే చూసి, ఎంట్రీ లెవల్లో ఇచ్చే ఇన్సెంటివ్స్కు కోత పెట్టేవారు. దీనిపై 2016లో ఇచ్చిన పాత సర్క్యులర్ను ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది. కాగా, పీహెచ్డీ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 5, ఎంఫిల్ ఉన్న వారికి 2 ‘నాన్ కాంపౌండెడ్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు’సాంక్షన్ చేసింది. యూజీసీ పేస్కేల్స్ 2006, 2016 ప్రకారం 2006 జనవరి1 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా తన ఆర్డర్లో పేర్కొన్నారు.
