రేగొండ /మొగుళ్లపల్లి, వెలుగు: కోటంచ లక్ష్మీనృసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు స్పీడప్ చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలించి, ఆఫీసర్లతో రివ్యూ చేపట్టారు. 50 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆఫీసర్లకు టార్గెట్ పెట్టారు. ఫిబ్రవరిలో స్వామి వారి పున:ప్రతిష్ఠ, బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పనులన్నీ నాణ్యతతో పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలోని కొటంచఆలయ పునరుద్ధరణ కోసం రూ.12.15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, నాయకులు తదితరులు ఉన్నారు.
అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లిలో కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతులో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర హాజరై గ్రామాల్లో సుపరిపాలన అందించాలని సూచించారు.
