
హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మార్కెట్ వాల్యూ పెంచిన ఆరు నెలల్లోనే మళ్లీ మార్కెట్ వాల్యూను పెంచడం తమకు ఇబ్బందిగా మారిందని చిన్న బిల్డర్లు వాపోతున్నారు. కరోనా మహమ్మారి రాకతో ఓవైపు అమ్మకాలు లేక, మరోవైపు కన్స్ట్రక్షన్ ఖర్చు విపరీతంగా పెరగడంతో సమస్యలతో సతమతమవుతున్నామని వారు చెబుతున్నారు. మార్కెట్ వాల్యూ పెంపుదలను కొంత కాలం వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి చిన్న బిల్డర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టులు చేపట్టే పెద్ద కార్పొరేట్ కంపెనీలను సంప్రదించి మార్కెట్ వాల్యూ పెంచాలనే నిర్ణయానికి ప్రభుత్వం రావడం సరయినది కాదని విమర్శిస్తున్నారు. 400 గజాల నుంచి 1000 గజాలలోపు చేపట్టే తమ ప్రాజెక్టులే ఎక్కువ మంది సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నాయని, ఇలాంటి తమకు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటున్నారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మార్కెట్ వాల్యూను 2021 జులైలో ఒకసారి పెంచారని, ఆరు నెలలలోపే ఈ నెల నుంచి మళ్లీ మార్కెట్ వాల్యూ పెంచడం అన్యాయమని చిన్న బిల్డర్ల అసోసియేషన్ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆరోపించింది. గ్రేటర్ సిటీ బిల్డర్స్, ఈస్ట్జోన్ బిల్డర్స్ అసోసియేషన్, కుకట్పల్లి బిల్డర్స్ అసోసియేషన్, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్, ప్రగతి నగర్ బిల్డర్స్ అసోసియేషన్, గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్, సౌత్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్లు ఈ ఫెడరేషన్లో భాగంగా ఉన్నాయి. ఫెడరేషన్లో మొత్తం 900 మంది బిల్డర్లున్నారని, వారిలో చాలా మంది చురుగ్గా నిర్మాణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి ప్రభాకర రావు మీడియాకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని, లా అండ్ ఆర్డర్ మెరుగుపడటంతోపాటు, విద్యుత్ కోతలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వారూ హైదరాబాద్లో నివాసం ఏర్పరుచుకునేందుకు ఇష్టపడుతున్నారని, ఇలాంటి నేపథ్యంలో అందుబాటు ధరలలో ఇండ్లు ఇవ్వగలిగే చిన్న బిల్డర్లను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు కస్టమర్లు ఇల్లు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని, తన ఆదాయం కోసం రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూలను ఏకపక్షంగా ప్రభుత్వం పెంచడం వల్లే ఇలా జరిగిందని అన్నారు.
కన్వేయన్స్ డీడ్స్పై స్టాంప్ డ్యూటీని జులై 2021లో 37.5 శాతం పెంచారని, దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 25 శాతం ఎక్కువయ్యాయి. అగ్రికల్చరల్ ల్యాండ్స్, ఇతర ప్రోపర్టీల మార్కెట్ వాల్యూ 30 శాతం నుంచి 100 శాతం పెంచారు. నాలా ట్యాక్స్ను జీహెచ్ఎంసీ పరిధిలో 50 శాతం ఇతర ఏరియాలలో 67 శాతం పెంచారు. కన్స్ట్రక్షన్ రంగంలో దాదాపు 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు, చిన్న బిల్డర్లే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తాజా మార్కెట్ వాల్యూ పెంపుదలతో చిన్న బిల్డర్లు కనుమరగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ టీ నరసింహా రావు, ట్రెజరర్ బి గోపాల్తోపాటు, ఇతర అసోసియేషన్ల ప్రతినిధులూ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.