నది ప్రవాహ తీవ్రతను గుర్తించలేని ఓ డ్రైవర్ నిర్లక్ష్యం 25 మంది ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజ్నోర్ నుంచి ప్రయాణికులతో హర్దివార్బయల్దేరిన ఓ బస్సు కోటవాలి సీజనల్ నది వద్దకు చేరుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదీ ప్రవాహం పెరిగింది.
అది గమనించకుండా బస్సు డ్రైవర్ నదిపై ఉన్న బ్రిడ్జీ నుంచి బస్సును పోనించాడు. అకస్మాత్తుగా ప్రవాహం పెరగడంతో బస్సు కదలిక ఆగిపోయింది. ఇంజిన్లోకి నీళ్లు వెళ్లి ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. నదిలో బస్సు ఉందన్న విషయాన్ని గుర్తించి స్థానికులకు పోలీసులు సమాచారం అందించారు. అప్పటికే ప్రాణ భయంతో కొందరు కిటికీలోంచి బస్సు టాప్పై ఎక్కడానికి ప్రయత్నించగా.. మరి కొందరు నిస్సహాయ స్థితిలో అలాగే ఉండిపోయారు. క్రేన్ సాయంతో బస్సు నదిలో కొట్టుకుపోకుండా చాలా సేపు ఆపారు. అనంతరం బస్సును నెమ్మదిగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఊహించని ఈ పరిణామంతో చాలా భయపడ్డామని ప్రయాణికులు వాపోయారు. జులై మొదటి వారంలో డెహ్రడూన్లో ఓ బస్సు ఇలాగే వరదల్లో చిక్కుకుపోయింది. కిటికీల సాయంతో బయటికి వచ్చి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు.