
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం సిటీలో క్యాబ్లు, ఆటోలు, బైక్లు అందుబాటులో ఉన్నాయి. కాగా వీటిలో అధికశాతం మంది బైక్లనే వాడుతుంటారు. తక్కువ చార్జీ కావడంతో సోలోగా వెళ్లేవారు వీటినే ఎంచుకుంటారు. దీంతో బైక్రైడింగ్కు డిమాండ్పెరుగుతోంది. కాగా దీన్ని ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. బైకర్లను పెంచుకునేందుకు అటాచ్మెంట్ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. రోడ్డు పక్కన గొడుగు వేసుకొని ఓలా, ఉబర్లకు బైక్ అటాచ్ చేయబడును అనే బోర్డులతో ప్రచారం చేయిస్తున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ తరహా బోర్డులు కనిపిస్తున్నాయి. ఏజెంట్లను నియమించుకొని ప్రచారం చేస్తున్నాయి.
రైడర్లను పెంచుకునేందుకు..
సిటీలో ఫుల్ టైం బైకర్లు 20 వేల మంది ఉంటే, పార్ట్ టైంగా నడుపుతున్నవారు 50 వేల మందికి పైగానే ఉన్నారు. బైక్ ఒకరిదైతే ఇతరుల లైసెన్స్, ఆర్సీ పెట్టి చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సిటీలో కొన్ని చోట్ల ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసే కంపెనీలకు చెందిన అటాచ్ మెంట్ పాయింట్ సెంటర్లు ఉన్నాయి. ఒకప్పుడు ఆఫీసుల్లోనే రైడర్ల డీటెయిల్స్ తీసుకుని ఐడీలు ఇచ్చేవారు. ఇప్పుడు ఏజెంట్లను పెట్టుకుని రైడర్ వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, షేక్ పేట, ఫిల్మ్నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, తార్నాక, ఉప్పల్, కేపీహెచ్బీ ఇలా చాలా ప్రాంతాల్లో ఈ తరహా పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా చోట్ల ఏజెంట్లను పెడుతున్నారు. ఈ ఏజెంట్లు బైకర్లతో కంపెనీల గురించి చెప్తూ రిజిస్టర్ అయ్యే విధంగా చేస్తున్నారు.
సేఫ్టీపై సోయెక్కడ?
ఇంటి నుంచి ఆఫీస్కి, పనిమీద వెళ్తున్న సమయంలో పెట్రోల్ డబ్బులను ఆదా చేసేందుకు కొందరు రైడర్ల అవతారం ఎత్తుతున్నారు. కేవలం లైసెన్స్ చూసి రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించడంతో కొంతమంది తమకు తెలిసిన వాళ్ల బైక్లు పెట్టి రిజిస్టర్ అవుతున్నారు. అయితే, బైక్ రైడర్దేనా? కాదా? అనే విషయాలను కూడా సంస్థలు పట్టించుకోవడం లేదు. దీంతో చాలామంది పార్ట్ టైం రైడర్లుగా మారిపోతున్నారు. అయితే ఈ రైడర్ల బిహేవియర్, వాళ్ల వల్ల కస్టమర్లు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ టైంలో రైడ్లు ఎలా వెళ్తున్నాయి? డబ్బుల విషయంలో రైడర్కి, కస్టమర్కి మధ్య చర్చలు లాంటి అనేక విషయాల మీద కంపెనీలు ఫోకస్ చేయడం లేదు. ఫలితంగా బైక్లు బుక్ చేసుకున్న చాలా మంది అసౌకర్యానికి, అభద్రతా భావానికి గురవుతూనే ఉంటున్నారు.
ప్రభుత్వం దృష్టి పెట్టాలి
ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో బైక్లు వచ్చాక ఇతర వెహికల్స్ వాడకం తగ్గిపోయింది. అయితే బైక్ ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. కంపెనీలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. బిజినెస్ను పెంచుకోవాలని మాత్రమే ఆలోచిస్తూ పాయింట్లను పెట్టి బైకర్లను అటాచ్ చేయించుకుంటున్నాయి. బైక్ నడుపుతున్న వారెవరు? ఎలాంటి వారు? అనే కనీస బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయడం లేదు. ఇలాంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ సంస్థల మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది.
– శివ, స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్