హైదరాబాద్ , వెలుగు: లాక్ డౌన్ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రమంతా ఈ నెల 7 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని చెప్పారు. కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రం ఈ నెల 30 వరకూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. షాపులను, ఇతర వ్యాపారాలను రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంచాలన్నారు. హాస్పిటళ్లు, మెడికల్ షాపులకు మాత్రం ఈ విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవని చెప్పారు. ఆదివారం కేసీఆర్ ఫాం హౌస్ నుంచి ఫోన్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కేంద్ర గైడ్లైన్స్పై చర్చించారు. కంటెయిన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రమంతా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. మెడికల్ సర్వీసులకు ఇందులో నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు లాక్డౌన్ సడలింపులపై సీఎస్ జీవో జారీ చేశారు.