గద్వాల, వెలుగు : మక్కజొన్న అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఓ రైతు అక్కడే గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని కలుగొట్ల గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఉండవల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన జమ్మన్న (64) తనకున్న ఎకరం భూమిలో మొక్కజొన్న సాగు చేశాడు.
చేతికొచ్చిన పంటను పది రోజుల కింద కలుగోట్ల రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. మంగళవారం తూకం పూర్తి కాగా.. బుధవారం ఉదయం వచ్చి ఫింగర్ ప్రింట్ వేయాలని ఆఫీసర్లు సూచించారు. దీంతో బుధవారం ఉదయమే రైతువేదిక వద్దకు వచ్చిన జమ్మన్న.. అక్కడే మెట్లపై కూలబడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించేలోగా అప్పటికే చనిపోయాడు.
