
నర్సాపూర్, వెలుగు : సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారి ఫోన్ హ్యాక్ చేసి రూ. 5.88 లక్షలు కాజేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో పట్టణంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన విశ్వనాథ్ గుప్తా అనే వ్యాపారికి ఇటీవల అమెజాన్ ఓచర్ పేరుతో ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేసిన వెంటనే అతడి అకౌంట్ నుంచి రూ. 5.88 లక్షలు కట్ అయ్యాయి. డబ్బులు పోయినట్లు గుర్తించిన సదరు వ్యాపారి గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.
ట్రాన్స్కో ఉద్యోగి ఖాతా నుంచి రూ.లక్ష..
మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి ట్రాన్స్కో ఏఎల్ఎం బంటు శ్రీకాంత్ సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం సబ్స్టేషన్లో డ్యూటీ చేస్తుండగా అతడికి ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. దానిని లిఫ్ట్ చేసిన వెంటనే అతడికి చెందిన రెండు అకౌంట్ల నుంచి విడతల వారీగా రూ.1,02,100 డెబిట్ అయ్యాయి. దీంతో వెంటనే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసిన అతడు గురువారం స్థానిక పోలీస్స్టేషన్పై కంప్లైంట్ ఇచ్చాడు.