
దసరా పండుగ వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రైల్వే శాఖ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో రైల్వే శాఖలోని 10.91 లక్షల మంది ఉద్యోగులకు బోనస్ దక్కనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 24) కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలోనే రైల్వే ఉద్యోగాలకు బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదనలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10.91 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు ఓకే చెప్పింది. దీని కోసం రూ. 1865.68 కోట్లు చెల్లించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీంతో పాటు ఈ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బీహార్ కు పలు కీలక రైల్వే లైన్లు, రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర కేబినెట్. బీహార్లోని భక్తియార్పూర్-రాజ్గిర్- తిలైయా రైల్వే లైన్ సెక్షన్ను మొత్తం రూ. 2,192 కోట్లతో చేపట్టడానికి ఆమోదం తెలిపింది. బీహార్లోని NH-139W 4 లేన్ల సాహెబ్గంజ్-అరెరాజ్-బెట్టియా సెక్షన్ను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో రూ. 3,822 కోట్లతో 78.942 కి.మీ. ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నౌకా నిర్మాణం, భారత నౌకానిర్మాణం & సముద్ర రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి రూ. 69,725 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది.