
శ్రీనగర్: సంప్రదాయానికి భిన్నంగా జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మంగళవారం పహల్గాంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. గత నెలలో జరిగిన టెర్రరిస్టుల దాడితో ఆందోళన చెందిన, పర్యాటకాన్నే నమ్ముకుని ఉపాధి కోల్పోయిన ప్రజలకు సంఘీభావంగా ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.
టెర్రరిస్టుల పిరికిపంద చర్యలకు తాము ఏమాత్రం భయపడబోమనే సందేశాన్ని ఇచ్చేందుకే ఇక్కడకు వచ్చామన్నారు. ఈ సమావేశం కాశ్మీర్ రాజధానులైన శ్రీనగర్, జమ్మూ వెలుపల జరగడం ఇదే తొలిసారిని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ‘‘శత్రువులు ఎప్పటికీ మన సంకల్పాన్ని నిర్దేశించలేరు. జమ్మూకాశ్మీర్ బలంగా, నిర్భయంగా ఉంది. ఇక్కడి ప్రజల ధైర్యానికి సెల్యూట్”అని అన్నారు.
టూరిస్ట్ స్పాట్లు ఓపెన్ చేస్తం
టెర్రరిస్టుల దాడితో రాష్ట్రంలో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పునరుద్ధరించాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. దాడి తర్వాత పర్యాటకులు కాశ్మీర్ను వీడటంతో టూరిజం తీవ్రంగా దెబ్బతిన్నదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న టూరిజాన్ని తిరిగి పుంజుకునేలా చేస్తామన్నారు. టెర్రరిస్టుల దాడి తర్వాత పహల్గాంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించామని గుర్తుచేశారు.
కొద్దిరోజులుగా మూతపడి ఉన్న టూరిస్ట్ స్పాట్లను తిరిగి ఓపెన్ చేస్తామని, భద్రత మరింత కట్టుదిట్టం చేసి టూరిస్టులకు భరోసా కల్పిస్తామని సీఎం తెలిపారు. ఐదారు వారాలుగా దేశ ప్రజలందరిలోనూ టెన్షన్ ఉన్నప్పటికీ, కాశ్మీర్ మాత్రం అత్యధిక మూల్యం చెల్లించుకుందని అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీస్కోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.