
ఎల్బీనగర్/ముషీరాబాద్, వెలుగు: సిటీలో విద్యుత్ శాఖ చేపట్టిన ఇంటర్నెట్, డిష్ టీవీ వైర్ల తొలగింపు కొనసాగుతోంది. గురువారం పద్మారావునగర్ ప్రాంతంలో ఉదయం నుంచి కరెంట్ స్తంభాలపై ఉన్న ఇంటర్నెట్, డిష్ కేబుల్ వైర్లను తొలగించారు. ఇంటర్నెట్ కనెక్షన్లు ఆగిపోవడం, టీవీలు మూగబోవడంతో ప్రజలు చిరాకుపడ్డారు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. రాంనగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, నాంపల్లి తదితర ప్రాంతాల్లోనూ కేబుల్స్ను అధికారులు కట్ చేశారు.
ఓల్డ్ సిటీలో ఆపరేటర్ల ఆందోళన..
ముందస్తు సమాచారం లేకుండా కేబుల్, ఇంటర్ నెట్ వైర్లు కట్ చేశారంటూ ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్ట, మీర్పేటలో సర్వీస్ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. వైర్లు కట్ చేయడం వల్ల అనేక సేవలకు అంతరాయం కలుగుతోందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి తమకు సమయం ఇవ్వాలని కోరారు.